రఘునాథపాలెం, ఆగస్టు 18: మనిషి జీవితంలో మనోఫలకంపై చెరగని జ్ఞాపకాల గురుతులు ఎన్నో. చెరిగిపోయే జాపకాలు మరెన్నో. రెప్పపాటు కాలంలో జరిగిపోయే ఎన్నెన్నో జ్ఞాపకాలను శాశ్వతంగా పదిల పరిచే అవకాశం ఒక్క ఫొటోగ్రఫీకే ఉంది. ‘కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం.. రెప్ప పాటేగా ఈ జీవితం..’ అన్నాడో కవి. అలాంటి రెప్పపాటు జీవితంలోని సుఖదు:ఖాలను కావ్యంగా నిలిపే ఫొటోగ్రఫీ.. మనిషి పుట్టుకకు ముందే వర్ణవర్ణాల బంధాన్ని ప్రారంభించి మనిషితో మమేకమైపోతోంది. ఉన్నది ఉన్నట్లుగా చూపడమే కాకుండా లేనిదీ ఉన్నట్లు చూపగలిగే మాయాజాలం ఫొటోగ్రఫీతోనే సాధ్యం. కళగా మొదలైన ఫొటోగ్రఫీ నేడు లక్షలాది మందికి జీవనోపాధిగా మారింది. శనివారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
ఇంతింతై వటుడింతై..
1836లో ప్రారంభమైన ఫొటోగ్రఫీ ఇంతింతై వటుడింతై అన్నట్లుగా శాఖోపశాఖలుగా విస్తరించి సర్వాంతర్యామి అయింది. ఎందరో శాస్త్రవేత్తల కృషితో ఫొటోగ్రఫీ అభివృద్ధి చెంది.. పిక్టోరియల్, వైల్డ్లైఫ్, ఫ్యాషన్, ఫ్యాషన్, అండర్వాటర్, ఏరియల్, మోడలింగ్, సైంటిఫిక్, స్ట్రియల్, వెడ్డింగ్, టేబుల్టాప్ వంటి శాఖలుగా విస్తరించింది. 1836లో మొదటగా ఓ వీధి ఫొటోతో ఫొటోగ్రఫీ ప్రారంభం కాగా.. డాగూరే కెమెరా నమూనాను 1839 ఆగస్టు 19న సైన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్స్లో ఆరాగే అనే వ్యాపారి విస్తరించాడు. అప్పటి నుంచి ఆగస్టు 19వ తేదీని వరల్డ్ ఫొటోగ్రఫీ డేగా పాటిస్తూ వస్తున్నారు.
అంతర్జాతీయ అవార్డులకు కేరాఫ్ ‘సంపత్’..
ప్రకృతిలో కనిపించే అందాలను తన కెమెరాలో నిక్షిప్తం చేస్తూ ఏటా వరల్డ్ ఫొటోగ్రఫీ దినోత్సవాన అవార్డులు అందుకుంటున్నాడు ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్, కృషి స్టూడియో అధినేత చావా సంపత్. ప్రకృతిలోని రమణీయమైన దృశ్యాలపై పరిశోధనలు చేస్తూ వాటిని తన కెమెరాలో బంధిస్తూ.. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో చిత్రాలను ప్రదర్శించి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అంతేగాక ఎన్నో అవార్డులు, బహుమతులను సంపత్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంపత్ తీసిన ‘లవ్ నేషన్ – లవ్ పీపుల్’ చిత్రానికి జాతీయస్థాయి అవార్డు దక్కింది. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో న్యూఢిల్లీ నేషనల్ మెడికల్ కమిషన్ డైరెక్టర్ డాక్టర్ జీబీరావు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కే.హేమచంద్రారెడ్డి, మాజీ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్, గోళ్ల నారాయణరావు, వెంకటరమణ, నరేంద్ర శ్రీనివాసరెడ్డిల చేతులమీదుగా సంపత్ ఈ అవార్డును అందుకున్నారు. చేసే వృత్తిలో నైపుణ్యాన్ని చాటుకోవాలంటే ఎదుటి వారి నుంచి ప్రసంశలు పొందాలని, అటువంటి మహత్తర వృత్తిని ఎనుకున్నందుకు సంతోషంగా ఉందని అంటున్నాడు సంపత్.