భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ భద్రాచలం, ఏప్రిల్ 16 : సరికొత్త రంగులు అద్దుకొని.. విద్యుద్దీప కాంతులతో మురిసిపోతున్న భద్రాద్రి పుణ్యక్షేత్రం సీతారాముల కల్యాణానికి రా.. రామ్మంటూ భక్తుజనులకు ఆహ్వానం పలుకుతోంది. బుధవారం ఉదయం సీతారాముల కల్యాణం జరిగే వేదిక మిథిలా ప్రాంగణం సర్వ హంగులు అద్దుకున్నది. రామయ్య పెళ్లికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలను సీఎస్ శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పించేందుకు మంగళవారం భద్రాచలం చేరుకున్నారు. గత వారం రోజుల నుంచి కలెక్టర్ ప్రియాంక ఆల భద్రాచలంలో మకాం వేసి పెళ్లి ఏర్పాట్లను, భక్తుల కోసం కల్పించే సౌకర్యాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు రామయ్య పెళ్లి పనులకు సంబంధించిన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా.. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఎస్పీ రోహిత్ రాజు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భద్రాచలంలో ఎటు చూసినా సీతారాముల కల్యాణ శోభ కనిపిస్తోంది. రాములోరి కల్యాణాన్ని తిలకించడానికి భక్తులు ఈసారి భారీగా తరలిరానున్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. భక్తులకు సరిపోయే విధంగా లడ్డూలు, తలంబ్రాలను భారీగా సిద్ధం చేశారు.
బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి రామయ్య పెళ్లి తంతును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భద్రాచలం తరలివస్తున్నారు. పెళ్లి తర్వాత రామయ్య పట్టాభిషేకం ఘట్టాన్ని కూడా కనులారా తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ, రైల్వే శాఖలు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేశాయి. ఆంధ్రా, ఒరిస్సా, ఛతీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు ఇప్పటికే భద్రాచలం చేరుకున్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో శ్రీరామ నవమికి ప్రజాప్రతినిధులు హాజరుకావడం లేదు. ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి హాజరై స్వామివారి కల్యాణానికి తలంబ్రాలు, పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక ఆల భద్రాచలంలో ఇతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. వీఐపీ, వీవీఐపీ గ్యాలరీల్లో కేవలం అధికారులు, భక్తులు మాత్రమే కల్యాణాన్ని తిలకించనున్నారు. అన్ని సెక్టార్లలో తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని వీక్షించడానికి ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చారు.
భద్రాద్రి రామయ్య కల్యాణంతోపాటు రామయ్య నడయాడిన పుణ్యభూమి పర్ణశాలలో సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. అలాగే భద్రాద్రి జిల్లాలోని అన్ని మండలాల్లో రామయ్య కల్యాణం వైభవోపేతంగా నిర్వహించనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి ‘ఎదుర్కోలు’ ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను రామాలయం నుంచి ఉత్తరద్వారం వద్దకు తీసుకొచ్చారు. వైకుంఠద్వారం వద్ద శ్రీరామచంద్రమూర్తిని, ఆయనకు అభిముఖంగా సీతమ్మను ఉంచారు. రామయ్య వైపు ఉప ప్రధానార్చకుడు కోటి శ్రీమన్నారాయణాచార్యులు, సీతమ్మ వైపు ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయోధ్య నుంచి రామచంద్రమూర్తి, మిథిలా నగరం నుంచి సీతమ్మ తల్లి వచ్చారని వారి గుణగణాలు, వంశ గౌరవం, ప్రతిభ, శౌర్యాన్ని వివరించారు. రామయ్య గరుత్మంతుడి వాహనంపై ఎందుకు వచ్చారని కేఈ స్థలశాయి ప్రశ్నించగా, త్వరితగతిన రావాలనే కోరికతో గరుత్మంతుడి వాహనంపై రామయ్య తండ్రి వచ్చారని శ్రీమన్నారాయణాచార్యులు బదులు ఇచ్చారు.
సీతారాముల కల్యాణాన్ని వీక్షిస్తే ఆ ఇంట సకల శుభాలు కలుగుతాయని వివరించారు. సీతమ్మ, రామయ్య గుణగణాలను వర్ణించిన తర్వాత మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ వాయిద్యాలకు అనుగుణంగా అర్చకులు మాలా పరివర్తన కార్యక్రమాన్ని నేత్రపర్వంగా జరిపారు. మాలా పరివర్తన కార్యక్రమంలో అర్చకులు చేసిన నృత్య రీతులు అందరిని ఆకట్టుకున్నాయి. అనంతరం రామయ్య పక్కన సీతమ్మ తల్లిని ఉంచి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఎలక్షన్ కోడ్ కారణంగా దేవాదాయశాఖ మంత్రి, జిల్లాకు చెందిన మంత్రులు ఎవరూ రాలేదు. అయితే ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలను సీఎస్ శాంతికుమారి దంపతులు, దేవాదాయ కమిషనర్ హనుమంతరావు సమర్పించారు. ఆ తదుపరి సీతారాములకు తాతగుడి సెంటర్ వరకు తిరువీథి సేవ జరిపారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికు మారి దంపతులు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ హనుమంతరావు, కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ రోహిత్ రాజు, ఈవో రమాదేవి పాల్గొన్నారు.
పర్ణశాల, ఏప్రిల్ 16 : సీతారాముల కల్యాణ మహోత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి పర్ణశాల రామాలయంలో స్వామివారికి ఎదుర్కోలు కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో స్వామివారికి తిరువీధి సేవ చేపట్టారు. కార్యక్రమంలో అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.