దీపం అజ్ఞానాంధకారం నుంచి మానవాళిని జ్ఞాన మార్గంలోకి నడిపే సాధనం. చెడుపై మంచి సాధించే విజయం. గోపికలను నరకాసురుడి నుంచి శ్రీకృష్ణుడు కాపాడిన రోజు. లంకాధిపతి చెర నుంచి శ్రీరాముడు సీతను విడిపించిన రోజు. వీటికి చిహ్నమే దీపావళి. ఆశ్వియుజ అమావాస్య సందర్భంగా సోమవారం ఉమ్మడి జిల్లా ప్రజలు ఘనంగా వేడుకలు జరుపుకోనున్నారు. చిన్నా పెద్దా అన్నివర్గాల ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకొంటారు. గగన వీధిలో కాంతి పుంజాలు నింపనున్నారు. పిల్లలు అందంగా ముస్తాబై ఇంటింటా సందడి చేయనున్నారు. పటాకులు కాలుస్తూ సందడి చేయనున్నారు. సోదరులు ఆడపడుచులను ఆశీర్వదించి కట్నకానుకలు అందివ్వనున్నారు. భక్తులు లక్ష్మీదేవిని పూజించనున్నారు. దీపాలు వెలిగించి ఇష్టదైవాన్ని కొలవనున్నారు. పితృదేవతలకు తర్పణాలు ఇవ్వనున్నారు. పిండవంటలు పంచుకోనున్నారు.
ఉభయ జిల్లాల్లో శనివారం నుంచే దీపావళి పండుగ సందడి మొదలైంది. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలోని మైదానంలో లైసెన్స్ పటాకుల దుకాణాలు వెలిశాయి. పటాకులు కొనుగోలు చేస్తూ నగరవాసులు కనిపించారు. అలాగే కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో మున్సిపాలీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రాకర్స్ దుకాణాల్లో పట్టణవాసులు పటాకులు కొంటూ సందడి చేశారు.
ముసిరే చీకట్లను తొలగిస్తూ.. అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తూ.. కుంచితత్వం నుంచి విశాల దృక్పథం వైపు పయనింపజేస్తూ.. మానవాళికి విజయాలు ప్రసాదిస్తూ.. ప్రతి కుటుంబంలో సంతోషాలను నింపుతూ.. ఆనందోత్సాహాలను కలిగిస్తూ కోటి కాంతుల దీపావళి వచ్చేసింది.. ఇంటింటికీ పండుగ తెచ్చేసింది.. ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దివాళి వేడుకలు జరుగనున్నాయి.. చిన్నారులు పటాకులు కాలుస్తూ సందడి చేయనున్నారు.. మహిళలు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ఖమ్మం, నవంబర్ 11: దీపావళి ప్రతి ఇంట్లో వెలుగులు నింపాలని, కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలు, ఐైష్టెశ్వర్యాలతో వెలసిల్లాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుతో పాటు ఎమ్మెల్యేలు ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.