భద్రాచలం, ఏప్రిల్ 9 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్నిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఉదయం గోదావరి తీరం నుంచి వెండి తీర్ధపు బిందెలో గోదావరి జలాలను తీసుకొచ్చారు. స్వామివారికి విశ్వక్సేన ఆరాధన, దైవ ప్రార్థన, ఆలయ ప్రదక్షిణ చేసి అంతరాలయంలోని మూలవరుల వద్ద ఉత్సవానుజ్ఞ తీసుకున్నారు. అనంతరం బేడా మండపానికి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి భగవత్ పుణ్యాహవాచన చేసి, 28 మంది బుత్విక్లకు దీక్షావస్ర్తాలు, కంకణధారణ నిర్వహించారు.
అంతరాలయంలోని మూలవరులు, ఉత్సవమూర్తులు, నిత్య కల్యాణమూర్తులకు కణ్డన్, ఆళ్వారు తల్లికి, రామదాసు పీఠానికి కంకణధారణ చేశారు. మంగళవాయిద్యాలతో బేడా మండపానికి వచ్చి ఉత్సవ పెరుమాళ్లకు కంకణధారణ చేశారు. ఆచార్య, బ్రహ్మ, ఋత్విక్లకు, ఆలయ అధికారులకు కంకణధారణ నిర్వహించారు. నవకలశ స్నపనం, ఉత్సవారంభ స్నపనం, నేత్రపర్వంగా జరిపారు. 108లీటర్ల పాలతో, అందులో సగభాగం పెరుగు, నెయ్యి, తేనె, పంచదార పంచామృతాలు, 9రకాల పళ్ల రసాలు, హరిద్రాచూర్ణం, గంధోదకం, సమస్త నదీ తీర్థములు, అయోధ్య నుంచి ప్రత్యేకంగా తెప్పించిన సరయూ నది తీర్థం, సహస్రధారలు, తులసిమాలలు, సాలగ్రామ హారములు, శ్రీయంత్రము, షోడశోపచారములు, కుంభ, ధ్వజ, అష్ట, ద్వాదశ హారతులు, పంచ ఉపనిషత్తుల మంత్రములు, ద్రావిడ పారాయణంతో నేత్రపర్వంగా రామయ్యకు అభిషేకం నిర్వహించారు.
యాగశాల వద్ద ఓంకార ధ్వజరోహణాన్ని ఎగురవేశారు. సాయంత్రం 5 గంటలకు తాతగుడి సెంటర్లో ఉన్న గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లి, గునపానికి పసుపు రాసి రక్షాబంధన గావించి, మట్టిపై వరాహం బొమ్మను వేసి న్యాస ధ్యానాదులు సమర్పించి, ఆర్ఘ, పాద్యాదులు సమర్పించి, మృత్సంగ్రహణం(పుట్టమన్నుతో) భక్తి, ప్రపత్తులతో నిర్వహించారు. పుట్టమన్నును సేకరించి, ఒక చిన్న పల్లకిలో పుట్టమన్నును ఉంచి, మరొక వాహనంలో గరుత్మంతుడు, హనుమంతుడు, సైన్యాధిపతి విశ్వక్సేనుడిని ఉంచారు. రామయ్యను కల్పవృక్ష వాహనంపై తిరువీధి సేవ జరిపారు.
యాగశాలలో పుట్టమన్నుతో పూజ నిర్వహించారు. 12పాలికలతో అంకురార్పణ జరిపారు. నవధాన్యాలు, ధాన్యంతో సోమకుంభాన్ని ఆవాహన చేసి సోమున్ని ఆవాహన చేసి, ఆఖండ దీపారాధన, క్షేత్ర పాలికుడిని, వాస్తు పురుషున్ని నాలుగు ద్వారముల దగ్గర ఎనిమిది కుంభములు ఉంచి, ద్వారతోరణ పూజ చేశారు. మోదుగు, రావి, జువ్వి, మేడి తోరణాలు కట్టారు. స్వామివారికి విడాహా వాచన(కుల దేవత) ఆవాహన చేసి, వాస్తు పురుషున్ని ఆవాహన చేశారు. అంకురారోపణ హవనం, వాస్తు హవనం, జరిపారు. అందులోని సంపాదాజ్యమును అంకురార్పణ పాలికలయందు, వాస్తుకూర్చయందు తమలపాకులతో సృశించారు. అనంతరం ఉత్సవ పెరుమాళ్లను బేడా మండపంలో ఉంచి, నూతన సంవత్సరాది పండుగ సందర్భంగా కేఈ స్థలశాయి నేతృత్వంలో స్వామివారి పాదాల వద్ద పంచాంగాలను ఉంచారు.
విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచన జరిపి ఆ తీర్ధాన్ని పంచాంగాలపై ప్రోక్షించారు. సరస్వతీదేవిని ఆవాహన చేసి సరస్వతి పూజ, లక్ష్మి అష్టోత్తర శతనామార్చన పసుపు, కుంకుమ, గంధం, ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. పంచాంగాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచి, మరో పుస్తకాన్ని వశిష్టుల వారికి(పంచాంగం చెప్పే) అర్చకుడికి ఇచ్చారు.
ముందుగా ఆలయ మర్యాదలతో సత్కరించి నమస్కరించారు. ఈ ఏడాది రామయ్య ఆదాయ, వ్యయం, సమానంగా ఉన్నట్లు తెలిపారు. రామయ్య పౌర్ణమి వరకు దీక్షలో ఉంటారు కావున ఏకాంత సేవలు, నిత్య కల్యాణాలు నిలిపివేశారు. రాజదర్భార్ సేవలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. గాలిగోపురానికి అభిముఖంగా ఉన్న ఆంజనేయస్వామికి మంగళవారం సందర్భంగా పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. తమలపాకులతో పూజ చేసి గంధ సింధూరాన్ని పూశారు. సాయంత్రం ఆంజనేయస్వామికి అప్పాలు, అరిసెలు నివేదించారు.
పర్ణశాల, ఏప్రిల్ 9 : ప్రముఖ పుణ్య క్షేత్రమైన పర్ణశాలలో ఈ నెల 17న శ్రీరామ నవమి నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం బ్రహ్మోత్సవ కార్యక్రమాలను అర్చకులు, అధికారులు వైభవోపేతంగా ప్రారంభించారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మూల విరాట్లకు అభిషేకాలు, నూతన వస్ర్తాలంకరణతోపాటు స్వామివారికి వేద విన్నపములు, భగవద్భర్ధన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మత్స్య గ్రహణం, బ్రహ్మోత్సవాల అంకురారోపణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో పంచాంగముల పూజా కార్యక్రమం నిర్వహించి పంచాంగ శ్రవణం చేపట్టారు. పంచాంగ శ్రవణంలో భాగంగా శ్రీక్రోధి నామ సంవత్సరంలో రాష్ట్రం అన్ని విధాలా ఎంతో అభివృద్ధి చెందుతుందని పండితులు తెలిపారు. సాయంత్రం తిరువీధి సేవను కనుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అర్చకులు శేష కిరణ్కుమారాచార్యులు, భరద్వాజాచార్యులు, నవమి ఫెస్టివల్ ఆఫీసర్ అనిల్, సూపరింటెండెంట్ కిశోర్, గుమస్తా ప్రసాద్, సిబ్బంది రాము, శివ పాల్గొన్నారు.