ఖమ్మం సిటీ, మార్చి 27: నగరం నడిబొడ్డున అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్న పలు దవా(గా)ఖానాలపై బుధవారం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు కొరఢా ఝుళిపించారు. లింగ నిర్ధారణ అనేది చట్టవిరుద్ధమని తెలిసి కూడా అక్రమాలకు తెరలేపిన వైరా రోడ్డులోని ఆదర్శ హాస్పిటల్పై దాడులు నిర్వహించిన పోలీసు యంత్రాంగం నిర్వాహకులపై కేసులు నమోదు చేసిన విషయం విదితమే. తాజాగా డీఎంహెచ్వో డాక్టర్ మాలతి, డిఫ్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ సైదులు సారథ్యంలో అదే ఆసుపత్రిలో సోదాలు జరిపారు. రికార్డులను, స్థానిక విభాగాలను తనిఖీలు చేసిన అధికారులు చివరకు దవాఖానకు తాళం వేశారు. అనంతరం సమీపానే కొనసాగుతున్న తులసి డెంటల్ హాస్పిటల్కు వెళ్లారు. స్థానికంగా వైద్యుడు లేకపోవడాన్ని, ఓ నర్సు రోగులకు వైద్యం చేస్తుండడాన్ని గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరినీ బయటికి పంపించి సీజ్ చేశారు.
పక్కనే ఉన్న పాజిటివ్ హోమియోకేర్కు వెళ్లి లైసెన్స్ చూపించాలని అడిగారు. నిర్వాహకులు నీళ్లు నమలడంతో సదరు వైద్యశాలను మూసి వేయించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో డాక్టర్ మాలతి మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నుంచి ఖమ్మం జిల్లాలో నడుస్తున్న ప్రతీ వైద్యశాలపైనా నిరంతర నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. డెమో కాశీనాథ్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు.