ప్రైవేట్ నర్సరీలపై ఉద్యానశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నర్సరీల చట్టాన్ని(2017) పకడ్బందీగా అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో నకిలీ విత్తనాలతో రైతులు ఇబ్బంది పడడంతో ఈ ఏడాది ముందస్తు చర్యలు చేపట్టారు. నర్సరీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే భారీ జరిమానాతోపాటు జైలుకు పంపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నిర్వాహకులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. విత్తనం ఎక్కడి నుంచి సేకరించింది.. బిల్లుల వివరాలు.. లాట్నెంబర్.. బ్యాచ్నెంబర్.. విత్తన పరీక్ష వివరాలు.. తయారుచేసిన తేదీ.. విత్తనం విత్తిన తేదీ.. నారుమొక్కలు అమ్మిన వివరాలు నిర్వాహకులు కచ్చితంగా తెలియజేయాలని చెబుతున్నారు. నర్సరీ ముఖద్వారం వద్ద బోర్డు పెట్టి అందులో నారుమొక్కల సంఖ్య, ధరల పట్టిక తెలుగులో క్లుప్తంగా పొందుపరచాలని సూచిస్తున్నారు.
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 11 : నర్సరీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని వారు ఇక కటకటాలపాలు కావాల్సిందే. వారు చేసిన తప్పదాన్ని బట్టి జరిమానాలు, జైలుశిక్ష కచ్చితంగా ఉంటాయి. సమస్య తీవ్రతను బట్టి రెండూ అమలుచేసే అవకాశమూ ఉంది. కొద్ది సంవత్సరాల క్రితం జిల్లావ్యాప్తంగా మెజార్టీ నర్సరీల నిర్వాహకులు జీవా రకం మిర్చినారు మళ్లు పోయడం, ఆ రకం విత్తనాలు నకిలీవి అని తేలడంతో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. అదేవిధంగా టమాట, ఇతర కూరగాయలకు సంబంధించిన నారుమళ్లు నాణ్యత లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ ఈ ఏడాదికి సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టింది. జిల్లాలో రిజిస్ర్టేషన్ చేయించుకొని నర్సరీలు, రెన్యువల్ చేయించుకోని వారి వివరాలను గత కొద్దిరోజుల నుంచి సేకరించే పనిలో పడ్డారు. మరికొద్ది రోజుల్లో సీజన్ ప్రారంభంకాబోతున్న నేపథ్యంలో నిర్వాహకులకు నర్సరీల చట్టం(2017)పై దిశానిర్దేశం చేసేందుకు జిల్లాకేంద్రంలో ప్రత్యేక అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు హాజరైన రాష్ట్రస్థాయి ఉద్యానశాఖ అధికారులు నిర్వాహకులకు తగిన సలహాలు, సూచనలు చేశారు. గ్రామాల్లో నర్సరీల నిర్వహణకు సంబంధించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలనే ఉద్దేశంలో ఆయా నియోజకవర్గాల, గ్రామాల విస్తరణ అధికారులకు మరిన్ని బాధ్యతలు అప్పగించారు. 2017 నర్సరీ చట్టం ప్రకారం నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోని యెడల వారిపై తక్షణం చట్టరీత్యా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
నర్సరీల రిజిస్ర్టేషన్ ఇలా..
నాణ్యత గల నర్సరీలో తీసుకోవాల్సిన ప్రమాణాలు అనేకం ఉంటాయి. ముఖ్యంగా నర్సరీ కోసం సరైన భూమిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం భూసార పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. గుర్తించిన భూభాగంలో చుట్టూ ఫెన్షింగ్ తప్పనిసరి. సరైన రోడ్డుమార్గం ఉండాలి. పిల్ల, తల్లి మొక్కల బ్లాక్లను వేరుగా పెట్టుకోవాలి. తగినంతగా నీటి వసతులు కల్పించుకోవాలి. నర్సరీ పరిసర ప్రాంతాల్లోనే కార్యాలయం, స్టోర్, ఏర్పాటు చేసుకోవాలి. మొక్కల పరివర్తన కోసం కావాల్సిన షేడ్నెట్, పాలీటన్నెల్ చాంబర్, వంటి సదుపాయాలు కల్పించడంతో నాణ్యమైన మొక్కలను తయారు చేసుకోవచ్చు. నర్సరీ నిర్వాహకులు 2017 నర్సరీ చట్టం ప్రకారం రిజిస్ర్టేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం పండ్ల మొక్కల ఉత్పత్తికి గాను రూ.5 వేలు రిజిస్ర్టేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా కూరగాయలు, పుష్పాలు, ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కల తయారీకి గాను వివిధ రకాల ఫీజులను ప్రభుత్వం నిర్దేశించింది. 2-4 లక్షల మొక్కల ఉత్పత్తికి రూ.1,000, నాలుగు లక్షల పైబడి మొక్కల తయారీకి రూ.2,500 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పైన ఉదహరించబడిన నియమ నిబంధనలు పాటించకపోతే సదరు నర్సరీ నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకుంటారు. రూ.50 వేల జరిమానా లేదా సంవత్సరంపాటు జైలుశిక్ష ఉంటుంది. ఒక్కోసారి జరిమానాతోపాటు జైలుశిక్ష సైతం విధించే అవకాశం ఉంది.
నర్సరీ చట్టం(2017) రూపాంతరం ఇలా..
నర్సరీ చట్టం 2010 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన నర్సరీ రిజిస్ర్టేషన్ ప్రకారంగా తొలుత ఆమోదించబడింది. వివిధ రకాలైన పండ్ల మొక్కలను ఉత్పత్తి చేయడంలో పాటించాల్సిన ప్రమాణాలను ఈ చట్టంలో పొందుపరిచారు. ఉద్యానపంటల నారు మొక్కల నుంచి విత్తనాలు తయారుచేసే క్రమంలో ప్రత్యేకంగా(సుగంధ ద్రవ్యాలు, మిర్చి, కూరగాయలు) నర్సరీదారులు కల్తీ విత్తనాలు వాడవద్దు. ఈ చట్టం నియమావళిని అనుసరిస్తూ 2012లో ఆంధ్రప్రదేశ్లో మరోమారు చట్టం తయారు చేసినప్పటికీ నియమ నిబంధనలు పొందుపరచలేదు. అనంతరం 2017 నర్సరీ నూతన చట్టం తయారు చేశారు. దీనిలో విత్తనాల నుంచి నారుమొక్కలు తయారు చేసే క్రమంలో పాటించాల్సిన నియమ నిబంధనలు కచ్చితంగా పొందుపరచారు. ఈ చట్టం ప్రకారం.. పండ్లు, కూరగాయలు, ఔషధ, సుగంధద్రవ్యాల నారుమొక్కలను తయారు చేయడానికి కావాల్సిన మౌలికవసతుల ఏర్పాటు, పురుగుమందులు, చీడపీడలు ఆశించకుండా ఆరోగ్యకరమైన నారు రైతులకు అందించడం, విత్తనం ఎక్కడ నుంచి సేకరించినది, బిల్లుల వివరాలు, లాట్నెంబర్, బ్యాచ్నెంబర్, విత్తన పరీక్ష వివరాలు, తయారు చేసిన తేదీ, విత్తనం విత్తిన తేదీ, నారు మొక్కలు అమ్మిన వివరాలు నిర్వాహకులు తప్పకుండా తెలియజేయాల్సి ఉంటుంది. నర్సరీ ముఖద్వారం వద్ద ఒక బోర్డును కచ్చితంగా ప్రదర్శించాలి. అందులో లభ్యమయ్యే నారుమొక్కల సంఖ్య, ధరల పట్టిక తెలుగులో క్లుప్తంగా పొందుపరచాలి.
నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు
నర్సరీల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవు. గడిచిన రెండునెలల నుంచి ఆయా నియోజకవర్గాల ఉద్యానశాఖ అధికారులు నర్సరీ యాక్టు(2017)పై అవగాహన కల్పిస్తున్నారు. నర్సరీల నిర్వా హకులు ఈ ఏడాది మిర్చి మొక్కలను భారీగా పెంచుతున్నారు. రైతులకు మొక్కలను అందజేసే సమయంలో పూర్తివివరాలతో కూడిన బిల్ను తప్పనిసరిగా ఇవ్వాలి. మోసాలకు పాల్పడి సొమ్ము చేసుకోవాలని చూస్తే భారీ జరిమానాతోపాటు, చట్టపరమైన చర్యలు కఠినంగా ఉంటాయి. ఇప్పటికే జిల్లాలో రాష్ట్ర ఉద్యానశాఖ అధికారులు పర్యటించి నర్సరీలను పరిశీలించారు.
– జీ అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి