పురోహితులు లగ్న పత్రిక రాసింది మొదలు ప్రింటింగ్ ప్రెస్కు వెళ్లి కార్డులు ప్రింట్ చేయించడం ఒక ఎత్తయితే.. వాటిని బంధువులు, స్నేహితుల ఊళ్లు, ఇళ్లకు తిరిగి పేరు పేరునా బొట్టుపెట్టి పంచడం ముహూర్తం రెండు రోజుల ముందు వరకు నడిచే తంతు. ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ లైన్లోకి రావడంతో సీన్ మారింది. పెళ్లిళ్లు.. పేరంటాళ్ల పిలుపునకు సెల్ ఫోనే ఏకైక మార్గం అయింది. పెళ్లిళ్లకే కాదు.. ఇతరత్రా శుభ కార్యాలకు సైతం వేదికను తెలిపేలా తమ స్థాయి, హోదాకు తగ్గట్టుగా ఆన్లైన్/డిజిటల్ ఇన్విటేషన్ వీడియోను రూపొందించి బంధువులు, స్నేహితుల గ్రూపుల్లో షేర్ చేస్తుండడంతో వందలాది మంది సభ్యులు చూసుకునే అవకాశం కలిగింది.
– సత్తుపల్లి, ఆగస్టు 24
సత్తుపల్లి, ఆగస్టు 24 : ఈ నెలలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. ముందే చెప్పుకున్నాం కదా.. ఇప్పుడు అందరూ బిజీ బిజీ అని..! పెళ్లంటే మాటలు కాదు. బోల్డంత హడావుడీ హంగామా ఉంటుంది. వందలు, వేలమందిని ఆహ్వానించాలి. ఇంటింటికీ వెళ్లి.. బొట్టు పెట్టి.. తప్పకుండా రావాలంటూ మరీ మరీ పిలిచేంత తీరుబడి ఇప్పుడు ఎవ్వరికీ ఉండడం లేదు. ఇప్పుడు మనమంతా అలాంటి ‘పాత కాలపు’ వాళ్లం కాదాయె..! అంతా ‘ఆధునికం’.. అంతా ‘ఆన్లైన్’..!! అందుకే, నేటి కాలంలో పెళ్లిళ్లు/పేరంటాల పిలుపులన్నీ ఆన్లైన్లో సాగిపోతున్నాయి. కొందరైతే, ఇందులోనూ తమ స్థాయికి తగ్గట్టుగా సృజనాత్మకతకు, ఆడంబరానికి పెద్ద పీట వేస్తున్నారు. లగ్న పత్రిక ప్రక్రియ, ప్రీ వెడ్డింగ్ వీడియోలు, ఫొటోలతో కూడిన ‘ఆహ్వాన పత్రిక’(వీడియో)లను వాట్సాప్/ఫేస్బుక్/ఇన్స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్నారు.
వీటిని స్వీకరించిన వారు కూడా.. ఈ ఆహ్వాన పద్ధతిని తప్పు పట్టడం లేదు. పైగా, ‘ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి పిలిచేంత తీరుబడి లేని రోజులివి’ అంటూ ‘సమర్థిస్తున్నారు’ (‘అర్థం చేసుకుంటున్నారు’- అంటేనే బాగుంటుందేమో కదా..). కొందరు మాత్రం.. సంప్రదాయాన్ని పూర్తిగా పక్కకు పెట్టకుండా, కొన్ని ఆహ్వాన పత్రికలను మాత్రమే ముద్రించి అత్యంత సన్నిహితులకు ఇస్తున్నారు. పనిలో పనిగా ఆన్లైన్/డిజిటల్ ఇన్విటేషన్ వీడియోతోపాటు పంపుతున్నారు. పెళ్లిళ్లకే కాదు.. ఇతరత్రా వేడుకలకు కూడా ఇలాగే ఆన్లైన్/డిజిటల్ ఇన్విటేషన్లు (ఆహ్వాన పత్రికలు) ‘పంచుతున్నారు’. పెళ్లి సందడి పూర్తయిన తర్వాత కూడా మెహందీ, సంగీత్, మంగళస్నానాలు, పెండ్లి బరాత్, డిన్నర్.. ఇలా అన్ని సందర్భాలూ సన్నివేశాలతో వీడియోలు రూపొందించి సామాజిక మాధ్యమాల వేదికగా బంధుమిత్రులు, సన్నిహితులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఆహ్వాన పద్ధతి ‘మోడ్రన్/లేటెస్ట్ ట్రెండ్’గా మారింది. ఇప్పటి ప్రపంచంలో అందరూ బిజీ బిజీ కదా..! ఈ ట్రెండ్ అనివార్యమేమో..!!
కరోనా ముందు వరకు ఇళ్లలో పెండ్లి జరిగితే స్థోమతనుబట్టి 1,000 నుంచి 3,000 కార్డుల వరకు ఆహ్వాన పత్రికలకు ఆర్డర్ ఇచ్చేవారు. ఇప్పుడు 100 నుంచి 200 వరకు మాత్రమే ప్రింట్ చేయించుకుంటున్నారు. అవి కూడా లేటెస్ట్ డిజైన్లతో కావాలని కోరుతున్నారు. ఎందుకంటే, డిజైన్ చేసిన పెండ్లి ఆహ్వాన పత్రికతోపాటు ప్రోమో వీడియోలను వాట్సాప్ ద్వారానే పంపుతున్నారు. అందుకే, కార్డుల ప్రింటింగ్ పూర్తిగా తగ్గింది.
– జువ్వా కేశవరావు, ప్రింటింగ్ ప్రెస్ యజమాని, సత్తుపల్లి
కాలం మారింది. మా రోజుల్లోనైతే గ్రామంలో ఎవరిదైనా పెండ్లి ఉన్నదంటే వారి బంధుమిత్రులకు సైకిల్పై/బస్సులో వెళ్లి మేం (రజకులు) కార్డులను ఇచ్చొచ్చేవాళ్లం. ఇప్పుడైతే గ్రామం వరకే ఇస్తున్నాం. కాలానికి అనుగుణంగా అన్నీ మారుతున్నట్లే.. పెళ్లి పిలుపుల పద్ధతి కూడా మారుతున్నది.
-బెల్లంకొండ ఆదినారాయణ, రజకుడు, సత్తుపల్లి