ఖమ్మం, మార్చి 5: ఖమ్మం జిల్లాలో రెండు వారాలుగా విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలు ఎండలు దంచి కొడుతూనే మరోవైపు రాత్రిళ్లు చలి పంజా విసురుతూనే ఉంది. సాయంత్రం 5 గంటల వరకు ఎండ తీవ్రత కనిపిస్తున్నది. రాత్రి 9 గంటలు దాటకముందే చలి తీవ్రత కనిపిస్తున్నది. మార్చి మొదటి వారంలోనే పగటి గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఆదివారమూ 37 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇ ప్పుడే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎండల ధాటికి తాళలేక ఇళ్లలో అటక పైకి ఎక్కిన కూలర్లను కిందికి దించుతున్నారు. వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. మరోవైపు స్తోమత ఉన్నవారు ఏసీలను కొనుగోలు చేస్తున్నారు.
సీజన్ ఆరంభంలోనే ఎండ తీవ్రత..
సీజన్ ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలకు చేరుకుంటే వచ్చే నెల, ఆ ముందు నెలలో 43 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఈ తీవ్రత ఇంకొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉష్ణోగ్రతల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
వేసవి వచ్చేసిన నేపథ్యంలో శీతల పానీయాల విక్రయాలు ఊపందుకున్నాయి. పండ్ల రసాలు, కొబ్బరి బోండాలు, కూల్డ్రింక్స్ దుకాణాల్లో పగలు రద్దీ కనిపిస్తున్నది. రోడ్డు పక్కన తోపుడు బండ్లపై నిమ్మరసం, చెరుకు రసాలు విక్రయించే వారి సంఖ్య మెల్లగా పెరుగుతున్నది. మార్కెటింగ్ ఫీల్డ్లో ఉండి పనిచేసే వారు పగలు డీహైడ్రేషన్ను అధిగమించేందుకు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. గృహ నిర్మాణ కార్మికులు, వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసే మహిళలు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళ్లలో పనులకు వెళ్లాలని, ఎండ తీవ్రత ఉన్నప్పుడు నీడపట్టున ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
తీసుకునే ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు, తేలికగా జీర్ణమయ్యే పదార్థాలు ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీలైనప్పుడల్లా నిమ్మరసం, మజ్జిగ, గ్లూకోజ్, కొబ్బరి నీళ్లు, ఉప్పు చక్కెర కలిపిన ద్రావణాన్ని తాగాలంటున్నారు. సూర్యరశ్మిని గ్రహించే గాఢమైన రంగుల దుస్తులు ధరించొద్దంటున్నారు. బయటకు వెళ్లేడప్పుడు టోపీ లేదా తలపాగా పెట్టుకోవాలంటున్నారు. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలంటున్నారు.
వడదెబ్బతో జాగ్రత్త సుమా..
శరీరం పొడిబారడం, దప్పిక ఎక్కువగా ఉండడం, నీరసం ఆవహించడం, తరచూ వాంతులు అవడం, గుండె దడ, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వారు వైద్యులను సంప్రదించాలి. ఆ లక్షణాలను వడదెబ్బగా గుర్తించాలి. చికిత్సకు పూనుకోకపోతే ప్రాణాలకే ముప్పు. వడదెబ్బకు గురైన వ్యక్తిని నీడపట్టుకు చేర్చాలి. శరీరానికి బాగా గాలి తగిలేలా చూడాలి. పరిశుభ్రమైన వస్త్రంతో దేహాన్ని తుడవాలి. ఉప్పు కలిపిన చల్లని నీరు, మజ్జిగ, గంజి లేదా గ్లూకోజ్ తాగించాలి. పాక్షిక అపస్మారక స్థితి లేదా పూర్తిగా స్పృహ తప్పినట్లుగా కనిపిస్తే బాధితుడు పడుకున్న బెడ్పై కాళ్లవైపు ఎత్తైన దిండు అమర్చి శరీర పైభాగం కంటే పాదాలు ఎత్తుగా ఉండేలా చూడాలి. డాక్టర్ సలహా మేరకు 500 మిల్లీ గ్రాముల పారాసిటమాల్ మాత్ర ఇవ్వాలి.