ప్రభుత్వ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోన్నతులకు పచ్చజెండా ఊపింది. అతి త్వరలో స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొందనున్నారు. ఎస్జీటీలు, పీఈటీలు, పండిట్లు స్కూల్ అసిస్టెంట్ కేడర్ ప్రమోషన్స్ అందుకోనున్నారు. విద్యాశాఖ అధికారులు సినియారిటీ ప్రకారం ఇచ్చేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి వేసవి సెలవులు, స్కూళ్ల ప్రారంభం నాటికి రిలీవ్ అయి కొత్త పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఖమ్మం, జనవరి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలం నుంచి ఉద్యోగోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు తీపికబురు అందించింది. అతి త్వరలో స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా, ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొందనున్నారు. స్కూల్ అసిస్టెంట్ కేడర్ ప్రమోషన్కు ఎస్జీటీలు, పీఈటీలు, పండిట్లు రానున్నారు. ఒక పక్క టీఎస్పీఎస్సీ ద్వారా కొలు వులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తూనే సీఎం కేసీఆర్ మరోవైపు దీర్ఘకాలికంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగోన్నతికి అవకాశం కల్పిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉద్యోగోన్నతులు ఇచ్చే పనిలో విద్యాశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. సీనియారిటీ ప్రాతిపదికన జాబితా సిద్ధం చేస్తున్నారు. బదిలీలు, ప్రమోషన్లు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి వేసవి సెలవులు, స్కూళ్ల ప్రారంభం నాటికి రిలీవ్ అయి కొత్త పాఠశాలలో జాయిన్ అయ్యే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఉపాధ్యాయులకు సంబంధించిన ఉద్యోగోన్నతులు మేనేజ్మెంట్ల వారీగా జరిగే అవకాశం ఉంది. ఉమ్మడి సీనియారిటీ ప్రాతిపదికన ఉద్యోగోన్నతులు ఇవ్వడానికి న్యాయపరమైన వివాదాలు తలెత్తుండడంతో పంచాయతీరాజ్శాఖల పద్ధతిలోనే ప్రక్రియ జరుగనున్నది. విద్యాశాఖలో ఏకీకృత సర్వీస్ రూల్స్ చిక్కులు ఉండడంతో మేనేజ్మెంట్ వారీగా ప్రమోషన్లు వచ్చేట్లు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల వారీగా వాటిలోని ఖాళీలు మైదాన ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతాల వారీగా, జిల్లా పరిషత్ పాఠశాలలు వాటిలో మైదాన, ఏజెన్సీ ప్రాంతాల వారీగా ఉద్యోగోన్నతులు రానున్నాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియ షురూ కానున్నది.
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులపై విద్యాశాఖ ఉన్నాతాధికారులు ఇప్పటికే అవసరమైన వివరాలు సేకరించారు. డీఈవో కార్యాలయం ద్వారా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. డీఈవో సోమశేఖరశర్మ ఉద్యోగోన్నతులకు ఖాళీలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని కేడర్ల వారీగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాత యులు, మండల విద్యాశాఖాధికారుల వద్ద నుంచి తీసుకున్నారు. ఏయే మండలాల్లోని పాఠశాలల్లో ఎక్కడెక్కడ కేడర్ల వారీగా ఉన్న ఖాళీలు ఉన్నాయనే అంశంపై కొద్దిరోజుల్లో స్పష్టత రానున్నది. 317 జీవో బదిలీల అనంత రం నూతన జిల్లాల వారీగా బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ జరుగనున్నది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్స్గా సబ్జెక్ట్ల వారీగా జీవశాస్త్రం, ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ సైన్స్, సోషల్, తెలుగు, పీఈటీ నుంచి పీడీగా ఉద్యోగోన్నతి పొందనున్నారు.
విద్యాశాఖలో కల్పించే ఉద్యోగోన్నతులకు సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే ఖాళీలను గుర్తించి ఉన్నాతాధికారులకు నివేదించాం. సీనియారిటీ జాబితాకు కేడర్ల ఆధారంగా వివరాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఉన్నాతాధికారుల సూచనల మేరకు సిద్ధంగా ఉన్నాం. సబ్జెక్ట్ల వారీగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల నుంచి ఖాళీలను నివేదించాలని సూచించాం. ప్రభుత్వం ప్రకటించే షెడ్యూల్కు అనుగుణంగా సన్నద్ధమవుతున్నాం. – సోమశేఖరశర్మ, డీఈవో, ఖమ్మం