ఎర్రుపాలెం, ఏప్రిల్ 18: తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న శ్రీవారి వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో నిత్య అనుష్టానములు, హోమాలు, మహాపూర్ణాహుతిని అర్చకులు నిర్వహించారు. 9 రోజులుగా విశేష పూజలు అందుకున్న అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వరస్వామికి యజ్ఞేశ్వరస్వామి ప్రీత్యర్థం వేదమంత్రోచారణలతో మహాపూర్ణాహుతి నిర్వహించారు.
అనంతరం ధ్వజారోహణ నిర్వహించి ధ్వజపతాకాన్ని అవనతము చేసి గరుడ స్వామికి షోడషోపచార పూజ నిర్వహించారు. స్వామికి పుష్కరిణిలో స్వామివారి ప్రతినిధి చక్రపెరుమాళ్లకు మేళతాళాలతో తోడ్కొని గంగాపూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, శ్రీవారి పుష్కరిణి దాత గుదే వెంకటేశ్వరరావు, అర్చకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.