మామిళ్లగూడెం, ఏప్రిల్ 15 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నాపత్రాల అంశంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లోతైన విచారణ చేపడుతున్నది. దీనిలో భాగంగా ప్రశ్నాపత్రాల లీకేజీ స్కాంలో సూత్రధారుడు ప్రవీణ్రెడ్డి విచారణలో ఇచ్చిన సమాచారం మేరకు సిట్ బృందం శనివారం ఖమ్మం నగరం రాపర్తినగర్లోని ప్రభుత్వ ఉద్యోగి శ్రీకాంత్ ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు చేపట్టింది. సదరు ఉద్యోగి కుమారుడు సాయిలౌకిక్, అతని భార్య సుస్మిత రాస్తున్న డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పోటీ పరీక్షకు ప్రవీణ్రెడ్డి నుంచి ప్రశ్నాపత్రం కొనుగోలు చేసిన అంశంపై విచారణ కొనసాగినట్లు, సాయిలౌకిక్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రవీణ్రెడ్డి ఖాతాకు రూ.6 లక్షల నగదు బదిలీ అయినట్లు సిట్ గుర్తించిందని సమాచారం.
నిందితుడి ఇంట్లో కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తున్నది. ఈ అంశంపై ఇప్పటికే భార్యాభర్తలు సాయిలౌకిక్, సుస్మితను అదుపులోకి తీసుకున్న సిట్ వీరి నుంచి మరెవరికైనా ప్రశ్నాపత్రం చేరిందా.. దీనిలో మరెవరైనా భాగస్వాములు అయ్యారా అన్న కోణాల్లో విచారిస్తున్నది. సాయిలౌకిక్ గతంలో పాత కార్ల కొనుగోలు వ్యాపారం నిర్వహించేవాడు. పోటీ పరీక్షల నేపథ్యంలో భార్యాభర్తలు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటూ ప్రిపేర్ అవుతున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె. భార్యాభర్తలను విచారణకు కోసం సిట్ వారితో పాటు ఖమ్మం తీసుకువచ్చింది. పకడ్బందీగా విచారణ చేపట్టిన తర్వాత బృందం తిరిగి హైదరాబాద్కు పయనమైంది.