ఖమ్మం సిటీ, డిసెంబర్ 30 : ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న పువ్వాడ ప్రీమియర్ లీగ్-3 క్రికెట్ టోర్నమెంట్ నాలుగో రోజుకు చేరుకున్నది. ప్లడ్లైట్స్ వెలుగుల్లో డే అండ్ నైట్ 20-20 మ్యాచ్లు క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి.
శుక్రవారం ఛాయిస్ స్పోర్ట్స్, దోరేపల్లి శ్వేత లయన్స్ జట్లు బరిలోకి దిగాయి. టాస్గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దోరేపల్లి శ్వేత లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 210 పరుగులు భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఛాయిస్ స్పోర్ట్స్ జట్టు 110 పరుగులకే కుప్పకూలిపోయింది. రెండోదఫా నిర్వహించిన ఫ్రెండ్లీ మ్యాచ్లో పోలీస్, డాక్టర్స్ జట్లు పోటీపడి క్రీడాభిమానులను అలరించాయి. కాగా పోటీలను ఖమ్మం నగర టీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, టోర్నీ నిర్వాహకులు ఎండీ మసూద్, బాలబోయిన సందీప్, ఫారూక్ పర్యవేక్షించారు. క్రీడాకారులకు సకల సౌకర్యాలు కల్పించారు.