ఖమ్మం వ్యవసాయం, మార్చి 26 : మార్కెట్లో ఎర్ర బంగారం ధర నేల చూపులు చూస్తోంది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితుల నుంచి ఇన్నాళ్లూ పంటను కాపాడుకుంటూ వచ్చిన రైతులకు తగ్గుతున్న రేటు ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది సిరులు కురిపించిన మిర్చి ధర ఈ ఏడాది పంట చివరి దశకు చేరే సమయానికి క్వింటాకు రూ.20 వేల దిగువకు పతనం కావడం.. నిల్వ చేసేందుకు కోల్డ్స్టోరేజీల్లో సామర్థ్యం లేకపోవడంతో ఎంతో కొంతకు సరుకును అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. జిల్లాలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మిర్చి సాగు రైతులకు ఆశించిన మేర దిగుబడి రాలేదు. గత సంవత్సరం తేజా రకం మిర్చికి క్వింటా రూ.25 వేలు పలకడంతో నిల్వ చేసిన సరుకును రైతులు బయటకు తీసి విక్రయించడంతో కోల్డ్స్టోరేజీలన్నీ ఖాళీ అయ్యాయి. అయితే గత ఏడాదికంటే ఈ సంవత్సరం మిర్చికి అధిక రేటు పలుకుతుందని ఆశించిన రైతులకు భంగపాటే మిగిలింది. ఈ ఏడాది గరిష్ఠ ధర క్వింటా రూ.22 వేలు పలికినా.. అది కూడా ఒకటి రెండు రోజులకే పరిమితమైంది. మార్కెట్లో పక్షం రోజుల నుంచి ప్రతి రోజూ క్వింటా ధర రూ.100-200 వరకు తగ్గుతూ వస్తోంది తప్ప పెరగడం లేదు. చైనా కంపెనీలకు సంబంధించిన ట్రేడర్లు కొనుగోలు చేయకపోవడం, నాణ్యమైన పంట మార్కెట్కు రాకపోవడమే ధరల తగ్గుదలకు కారణమవుతున్నదని వ్యాపారులు, అధికారులు పేర్కొంటున్నారు. మంగళవారం వివిధ జిల్లాల నుంచి రైతులు సుమారు 16 వేల బస్తాలను విక్రయానికి తీసుకొచ్చారు. ఉదయం జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటా రూ.19,800 మాత్రమే పలికింది. ఈ ఏడాది ఇదే అత్యల్ప ధర అని మార్కెట్కు పంటను తీసుకొచ్చిన రైతులు వాపోయారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మిర్చి పంటను విక్రయానికి తీసుకొచ్చిన రైతులు రెండు రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు చివరి రకం పంట కావడంతో ఖరీదుదారులు ఆశించిన మేర ధర పెట్టడం లేదు. మరోవైపు కోల్డ్స్టోరేజీల్లో పంట నిల్వ చేద్దామంటే హౌజ్ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. దీంతో పంటను విక్రయానికి తీసుకొచ్చిన రైతులు మళ్లీ ఇంటికి తీసుకెళ్లలేక ఎంతో కొంతకు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఖమ్మం మార్కెట్ పరిధిలో 11 కోల్డ్ స్టోరేజీలు ఉండగా.. వాటిలో సుమారు 13.50 లక్షల బస్తాల సామర్థ్యం ఉండగా.. దాదాపుగా పూర్తిస్థాయిలో నిండిపోయాయి. అయితే మిర్చి చివరి రకం కావడంతోనే వ్యాపారులు ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరుసగా మార్కెట్కు మూడు రోజులు సెలవులు వచ్చినప్పటికి మంగళవారం 16 వేల బస్తాలు మాత్రమే విక్రయానికి రావడం ధరల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది.