వానకాలం రైతులు పండించిన ధాన్యం సేకరణకు రాష్ట్ర సర్కార్ పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీనిలో భాగంగా వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు ఖమ్మం జిల్లా నుంచి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రైతులు 1,17,409 హెక్టార్లలో వరి సాగు చేస్తుండగా 6,67,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగిన విధంగా 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ధాన్యం సేకరణకు 1.25 లక్షల గన్నీ బ్యాగులను సిద్ధం చేశారు.
ఖమ్మం, సెప్టెంబర్ 3:వానకాలం ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా లక్ష్యం వివరాలను పౌర సరఫరాల శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 236 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు.. జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 1,17,409 హెక్టార్లలో వరి పంట సాగవుతోంది. హెక్టార్కు 5,681 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని, తద్వారా జిల్లాలో మొత్తం వరి దిగుబడి 6,67,000 మెట్రిక్ టన్నులు వస్తుందని వ్యవసాయ, పౌర సరఫరాల అధికారులు అంచనా వేశారు. దీనిలో స్థానిక అవసరాలకు 93,380 మెట్రిక్ టన్నులు, విత్తనాల కోసం మరో 10 వేల మెట్రిక్ టన్నులు పోగా మిగిలిన 5,63,620 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిలో మిల్లర్లు నేరుగా 63,620 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మిగిలిన 5 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 236 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
236 కొనుగోలు కేంద్రాలు..
ఖమ్మం జిల్లాలో ఈ వానకాలంలో రైతుల వద్దనే 236 కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. వీటిలో ఐకేపీ ఆధ్వర్యంలో 50, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 152, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో 30, ఏఎంసీ ఆధ్వర్యంలో 4 కలిపి మొత్తం 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇవి కూడా నవంబర్ మొదటి వారంలో ఏర్పాటు చేయనున్నారు. ఈలోపు సిబ్బందికి కొనుగోళ్లపై శిక్షణ పూర్తి చేయనున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఈ ఏడాది నవంబర్లో 80 వేలు, డిసెంబర్లో 3 లక్షల మెట్రిక్ టన్నులు, వచ్చే ఏడాది జనవరిలో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేలా ప్రణాళిక ఖరారు చేశారు.
1.25 లక్షల గన్నీ బ్యాగులు సిద్ధం
ఈ వానకాలంలో ధాన్యం కొనుగోలు కోసం 1.25 లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా ప్రస్తుతం జిల్లాలో 62,59,650 గన్నీ సంచులు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 40,80,341 గన్నీ బ్యాగులను వివిధ రూపాల్లో సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో ఒక్కసారి ఉపయోగించిన గన్నీ సంచులను రేషన్ దుకాణాల ద్వారా సేకరించాలని నిర్ణయించారు. అంతేకాకుండా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అక్టోబర్లో శిక్షణ ఇచ్చి రైతులకు ఇబ్బందులు కలుగుకుండా చర్యలు తీసుకోనున్నారు.
మద్దతు ధర రూ.143 పెంపు..
గత ఏడాది గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.2060 మద్దతు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అదనంగా రూ.143 పెంచి రూ.2203 ఇవ్వాలని నిర్ణయించింది. సాధారణ రకానికి కూడా నిరుడు రూ.2040 ఉండగా ఈ ఏడాది రూ.143 పెంచి రూ.2183 ఇవ్వనుంది. ఈ సారి వరి కోతలు ముందుగానే ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.
5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం..
జిల్లాలో ఈ వానకాలంలో 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళికను రూపొందించాం. వీటి కోసం వివిధ శాఖల ఆధ్వర్యంలో 236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. ప్రతి కేంద్రంలో ముందస్తుగానే గన్నీ బ్యాగులు ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. కొనుగోలు కేంద్రాల్లో తాగునీటి వసతి, కరెంట్, టార్పాలిన్ కవర్లు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ స్కేళ్లు, మాశ్చరైజ్ మీటర్లను ముందస్తుగానే ఏర్పాటు చేస్తాం. రైతులు కూడా తమ ధాన్యాన్ని నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి. తద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లోపే వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు.
– మధుసూదన్ నాయక్, అదనపు కలెక్టర్, ఖమ్మం