అశ్వారావుపేట/ అశ్వారావుపేట రూరల్, జనవరి 28: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. మరింత అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి శనివారం మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన.. తొలుత క్యాంపు కార్యాలయంలో మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ఏడాదిలోనే ఎన్నికలు రానున్నందున ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్ష నాయకులు వస్తుంటారని అన్నారు. అయితే వారు పాలన అందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ లాంటి పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించార. ప్రతిపక్ష నాయకులందరూ ఎన్నికల సమయంలో వచ్చిపోతారని, కానీ బీఆర్ఎస్ మాత్రం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తోందని అన్నారు. అందుకని ప్రజలందరూ బీఆర్ఎస్ను ఆదరించాలని కోరారు.
రాష్ట్రంలో 90 శాతానికి పైగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వారే అయినందున వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు సునాయసనమేనని స్పష్టం చేశారు. మన ప్రగతిని చూసిన సరిహద్దు రాష్ర్టాల ప్రజలు.. తమను కూడా తెలంగాణలో కలపాలని కోరుతున్నారని, కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే కూడా తమ రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు తెలంగాణ సంక్షేమ పథకాలు కావాలంటూ అడుగుతున్నారని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సంపూర్ణ అభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, చిన్నంశెట్టి వరలక్ష్మి, పైడి వెంకటేశ్వరరావు, నిర్మల పుల్లారావు, చిట్లూరి ఫణీంద్ర, అట్టం రమ్య, మందపాటి రాజమోహన్రెడ్డి, కాసాని వెంకటేశ్వరరావు, యూఎస్ ప్రకాశ్రావు, తాడేపల్లి రవి, బిర్రం వెంకటేశ్వరరావు, సత్యవరపు సంపూర్ణ, చందా లక్ష్మీనర్సు, జే.వెంకన్నబాబు పాల్గొన్నారు.
మండలంలో విసృత పర్యటన
ఖమ్మం ఎంపీ, ఎమ్మెల్యే మెచ్చా కలిసి మండలంలో విస్తృతంగా పర్యటించారు. నారంవారిగూడెంలో ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో పాల్గొని రూ.50,116 విరాళం అందజేశారు. నారాయణపురం జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి మామ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆమెను పరామర్శించారు. కాగా, అశ్వారావుపేట పంచాయతీకి రూ.10 కోట్లు మంజూరు చేయించి అభివృద్ధి సహకరించాలని సర్పంచ్ పాలకవర్గ సభ్యులు నామాకు విజ్ఙప్తి చేశారు. తమ గ్రామాల సమస్యలపై జమ్మిగూడెం, గు మ్మడవల్లి, సుద్దగోతులగూడెం ప్రజలు నామాకు వినతిపత్రాలు అందించారు.
ఎంపీ నామా సమక్షంలో బీఆర్ఎస్లో చేరికలు
దమ్మపేట/ ఖమ్మం, జనవరి 28: బీఆర్ఎస్ పథకాలకు ఆకర్షితులై పలువురు నాయకులు పార్టీలో చేరారు. దమ్మపేట మండలం నల్లకుంటకు చెందిన న్యాయవాదులు సోడెం వెంకట్, అద్దంకి మధులతోపాటు మరికొందరు నాయకులు.. మందలపల్లి ఉప సర్పంచ్, దిశ కమిటీ సభ్యుడు గారపాటి సూర్యనారాయణ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లోకి వచ్చారు. వీరంతా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సమక్షంలో ఖమ్మంలోని ఆయన నివాసంలో పార్టీలో చేరగా.. వారందరికీ ఎంపీ నామా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.