భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లను లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. కేంద్రాలకు కాంట్రాక్టర్ సరఫరా చేసే గుడ్లు పక్కదారి పట్టకుండా.. పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోకుండా గుడ్లపై సర్కారు ముద్ర వేస్తున్నారు. కేంద్రాల్లో నెలలో మూడుసార్లు గుడ్లను ఇస్తుండగా.. ఆయా కేంద్రాలకు కాంట్రాక్టర్ మూడు రంగుల్లో ముద్రించిన గుడ్లను సరఫరా చేస్తున్నారు. వాటిని కేంద్రాల్లోని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. దీనిపై ఆయా కేంద్రాల్లో ముందస్తుగా సీడీపీఓలు, సూపర్వైజర్లు టీచర్లకు అవగాహన కల్పించారు.
జిల్లాలో మొత్తం 2,063 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో గర్భిణులు 8,444 మంది, బాలింతలు 7,467 మంది ఉన్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 33,936 మంది. 3 నుంచి 6 ఆరేళ్లలోపు 29,151 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలతోపాటు మూడు నుంచి ఆరు నెలల చిన్నారులకు రోజుకొకటి చొప్పున రెండు విడుతల్లో గుడ్లను అందజేస్తున్నారు. ఆరు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు నెలకు రెండు విడుతల్లో గుడ్లు పంపిణీ చేస్తున్నారు.
ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు పారదర్శకంగా అందించేందుకు ఏడు జోన్లుగా విభజించింది. ఇందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను నాల్గవ జోన్గా గుర్తించింది. ఈ క్రమంలో గుడ్లపై జోన్-4 తెలంగాణ ప్రభుత్వం అని రౌండ్ సీల్ వేస్తున్నారు. నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ముద్రించిన గుడ్లను మూడు విడుతల్లో అందజేస్తున్నారు. వానకాలంలో నీలం, ఎరుపు రంగుల్లో ముద్రించిన గుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. మొదట సరఫరా చేసిన రంగు గుడ్లు పూర్తిగా అయిపోయిన తర్వాతే మరో విడత అందజేయనున్నారు. ఇలా పకడ్బందీగా సరఫరా చేయడంతో ఎప్పటి గుడ్లు అప్పుడే పంపిణీ జరగడంతోపాటు పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది.
అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే గుడ్లు ఇకనుంచి పక్కదారి పట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే.. వాటిపై ప్రభుత్వం ముద్రించిన గుర్తు ఉంటుంది. వాటిని ఎక్కడైనా విక్రయించినా.. పక్కదారి పట్టించినా ఆయా కేంద్రాల నిర్వాహకులు వెంటనే దొరికిపోతారు. ప్రభుత్వం తాజా గుడ్లను లబ్ధిదారులకు ఇవ్వడంతోపాటు అవకతవకలకు అడ్డుకట్ట వేయడానికి ఇలాంటి పక్కా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నది. ప్రతి విడతలో లబ్ధిదారులు పౌష్టికాహాకం తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వం చేసిన మార్పులు, పకడ్బందీ చర్యల వల్ల అంతా పారదర్శకంగా ఉంటుంది. చిన్నారులు పౌష్టికాహార లోపం నివారించుకోవాలి. గ్రామాల్లో నిత్యం పర్యవేక్షిస్తూ బాలింతలు, తల్లులకు అవగాహన కల్పిస్తున్నాం.
– ఎడ్ల పద్మ, అంగన్వాడీ టీచర్, రామవరం
కోడిగుడ్లపై ముద్రలు వేసి దశలవారీగా బ్లూ, గ్రీన్, రెడ్ రంగుల్లో మూడు విడుతల్లో సరఫరా చేయడంతో పారదర్శకత పెరుగుతుంది. లబ్ధిదారులకు తప్పకుండా చేరాలనే ప్రభుత్వ ఉద్దేశం బాగుంది. ఇలాంటి చర్యలతో అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. పౌష్టికాహారం పంపిణీని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. లబ్ధిదారులకు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
– నిర్మలాజ్యోతి, సీడీపీవో, చండ్రుగొండ