ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్ 13: పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జరుగుతున్న టెన్త్ స్పాట్ ప్రశాంతంగా మొదలైంది. వాల్యుయేషన్లో భాగంగా విధులకు సంబంధించి ఉత్తర్వులు అందుకున్న వారందరూ రిపోర్ట్ చేయాలని డీఈవో ఆదేశించడంతో అత్యధికంగా అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్కు రిపోర్ట్ చేశారు. ఉదయం 9 గంటలకే మొదలైన ప్రక్రియలో మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా తమ హాజరును నమోదు చేయించుకున్నారు. తొలిరోజు సాయంత్రం స్పాట్ను వాల్యుయేషన్ ప్రారంభించారు. సంఘాల నాయకులు ఉపాధ్యాయులకు సంబంధించిన రెమ్యునరేషన్తోపాటు చిన్న చిన్న సమస్యలను డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిష్కరిస్తామని ఆయన హామీ ఇవ్వడంతో ప్రశాంతంగా సాగనుంది.
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ఉపాధ్యాయులకు స్పాట్ డ్యూటీలు కేటాయించారు. సబ్జెక్టుల వారీగా సీనియార్టీ ఉపాధ్యాయులను అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్క్రూటినైజర్లుగా నియమించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ఉపాధ్యాయులు మధ్యాహ్నం వరకు చేరుకుంటుండంతో స్పాట్ ప్రక్రియ కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. రిపోర్ట్ చేసిన ఉపాధ్యాయులకు అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు సబ్జెక్టుల వారీగా పేపర్ కోడ్ల ఆధారంగా రూములు కేటాయించారు. అనంతరం వాల్యుయేషన్కు పేపర్లను అందజేశారు. తెలుగు, ఇంగ్లిష్ సహా ఐదు సబ్జెక్టుల్లో కొందరు ఉపాధ్యాయులు రిపోర్ట్ చేయకపోవడంతో వారిపై చర్యలు తీసుకునేలా వివరాలు సేకరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులకు ఇందుకు సంబంధించి మౌఖిక ఆదేశాలు వెళ్లాయి. స్పాట్ విధులు కేటాయించిన వారిని రిపోర్ట్ చేయాలని, వారిని వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించారు.
స్పాట్ విధుల నుంచి తమను మినహాయించాలని దరఖాస్తులు చేసుకున్న వారు రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్పాట్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా డీఈవో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. స్పాట్కు సంబంధించి కొందరు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో స్పాట్ ఆర్డర్లు క్యాన్సిలేషన్ చేయించేందుకు ప్రయత్నాలు చేశారు. ఇందుకు సంబంధించి జన్యూనిటీని పరిగణనలోకి తీసుకొని ఎంఈవోల ద్వారా ఆర్డర్ల క్యాన్సిలేషన్ అందజేయనున్నట్లు ప్రకటించారు.
సెయింట్ జోసెఫ్లో అత్యంత పెద్ద ప్రాంగణంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్న స్పాట్ను డీఈవో నిత్యం సమీక్షిస్తున్నారు. ఒకేషనల్ సబ్జెక్టులో జిల్లాకు పేపర్లు రాలేదు. ఆరు సబ్జెక్టుల్లో 2లక్షల 20 వేల వరకు పేపర్లు చేరుకున్నాయి. సీఈలు 122 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 897 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 390 మందిని విధుల కోసం కేటాయించారు. వీరందరూ రిపోర్ట్ చేస్తే వారు నిర్వహిస్తున్న ప్రక్రియను, కేడర్ల వారీగా జరుగుతున్న స్పాట్ను డీఈవో పర్యవేక్షిస్తారు. జిల్లాలో 9 రోజులపాటు నిర్వహించే మూల్యాంకనానికి 2,20,528 సమాధాన పత్రాలు చేరాయి. వాటికి సంబంధించి డీఈవో బుధవారం స్పాట్ కేంద్రంలో డీ కోడింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. తెలుగులో 56,943 పేపర్లు, హిందీలో 31,811 పేపర్లు, ఇంగ్లిష్లో 38,008 పేపర్లు, గణితంలో 22,183 పేపర్లు, భౌతిక శాస్త్రంలో 35,763 పేపర్లు, జీవశాస్త్రంలో 13,257 పేపర్లు, సోషల్లో 22,563 పేపర్లను వాల్యుయేషన్ చేయనున్నారు. స్పాట్ జరుగుతున్న పాఠశాల పరిధిలో పోలీసులు 144 సెక్షన్ను అమలుచేస్తున్నారు.
మూల్యాంకనం ప్రక్రియలో సహాయ ఎగ్జామినర్లు ఎంత కీలకపాత్ర వహిస్తారో స్పెషల్ అసిస్టెంట్లు కూడా అదేస్థాయిలో కీలకపాత్ర వహిస్తారు. 390 మందికి పైగా స్పెషల్ అసిస్టెంట్ల విధులు కేటాయించగా వారిలో 100 మందికి పైగా గైర్హాజరైనట్లు తెలుస్తోంది. మూల్యాంకనం చేసేందుకు ఏఈలకు పేపర్లు ఇచ్చేందుకు ఎస్జీటీలను స్పెషల్ అసిస్టెంట్లుగా నియమించారు. వీరి గైర్హాజరీతో అవసరమైన మేర మిగిలిన పాఠశాలల నుంచి శుక్రవారం నుంచి స్పెషల్ అసిస్టెంట్లను నియమించి రిలీవ్ చేయాలని ఎంఈవోలను డీఈవో ఆదేశించారు. సబ్జెక్టు టీచర్ల కొరత సైతం వాల్యుయేషన్లో వేధిస్తోంది. అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా, చీఫ్ ఎగ్జామినర్లుగా వారి హోదాలు, సీనియార్టీ ప్రకారం బాధ్యతలు అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు.