ఖమ్మం సిటీ, జూన్ 13 : ఆనాడు పేదోళ్లకు పెద్ద జబ్బు చేస్తే ప్రాణాలపై ఆశలు వదులుకునేవారు. గర్భిణులు ప్రసవానికి ప్రభుత్వాస్పత్రికి వెళ్లడానికి జంకేవారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు ఖర్చయినా పరవాలేదు ప్రైవేటు ఆస్పత్రులకు వెళదామనేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారింది. ఏ రోగమొచ్చినా ప్రభుత్వ ఆస్పత్రులకే వెళదామంటున్నారు. గర్భిణులు ప్రసవానికి ముందుగానే సర్కారు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. సుఖప్రసవాలు చేయించుకుంటున్నారు. కేసీఆర్ కిట్లు, నగదు సాయం అందుకుంటున్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు ఆ బాధలోనూ ప్రభుత్వ ఆస్పత్రులకే పోదామంటున్నారు.. వీటన్నింటికీ కారణం.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్యారోగ్య శాఖలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషి మేరకు సీఎం కేసీఆర్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. పేదలు, మధ్యతరగతి ప్రజలకు సర్కారు ఆస్పత్రులపై నమ్మకం కలిగేలా కార్పొరేట్ వైద్యానికి నాంది పలికారు. కిడ్నీ డయాలసిస్.. గుండె ఆపరేషన్లు.. ఐసీయూ, వెంటిలేషన్ వంటి సౌకర్యాలు కల్పించారు. పల్లె, బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి ప్రజల ముంగిట్లోకి వైద్యాన్ని తీసుకొచ్చారు. తాజాగా ఖమ్మం పెద్దాస్పత్రికి అనుసంధానంగా మెడికల్ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేసింది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం వైద్యారోగ్య శాఖ ఉత్సవాలు జరుపుకోనున్నారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వైద్యారోగ్య శాఖ చరిత్ర గతి ఒక్కసారిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వం వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ, రోగులకు నాణ్యమైన సేవలు, మౌలిక అంశాలకు పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. 2014లో ఖమ్మం ఎమ్మెల్యేగా గెలుపొందిన పువ్వాడ అజయ్కుమార్ తెలంగాణ సర్కారు పథకాలను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయిస్తూ.. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిని అప్గ్రేడ్ చేశారు. రూ.20కోట్ల అంచనా వ్యయంతో 150 పడకలతో మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం రోజుకు 30 నుంచి 40 ప్రసవాలు జరుగుతుండగా.. సాధారణ కాన్పులే ఎక్కువగా నమోదు కావడం విశేషం.
‘కేసీఆర్ కిట్’ సూపర్ హిట్
2017లో ప్రవేశ పెట్టిన అమ్మ ఒడి, కేసీఆర్ కిట్ పథకాలు ప్రజల్లో విశేషాదరణ పొందుతున్నాయి. గర్భిణులకు మూడు, నాలుగు వైద్య పరీక్షల కోసం జిల్లాలో 11 ప్రత్యేక వాహనాలను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవం జరిగితే ఆడపిల్లకు రూ.13వేలు, మగబిడ్డకు రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తున్నారు. సర్కారు దవాఖానలో పుట్టిన బిడ్డకు 15 రకాల వస్తువులతో కూడిన ‘కేసీఆర్ కిట్’ను కానుకగా అందిస్తున్నారు. ఇప్పటివరకు 48,229 కేసీఆర్ కిట్లను అందించడం విశేషం.
ఉచితంగా డయాలసిస్..
తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అనుసంధానం చేసి అన్ని సర్కారు దవాఖానల్లో ఉచిత డయాలసిస్ కార్యక్రమానికి నాంది పలికారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో నెలకొల్పిన కేంద్రం రోజుకు 30 నుంచి 40 మందికి డయాలసిస్ సేవలు అందిస్తున్నది. సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రిలోనూ డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చారు.
పేదోడి గుండెకు భరోసా..
గుండె సంబంధిత జబ్బులకు ప్రభుత్వాస్పత్రుల్లోనే వైద్య సేవలు అందించాలని తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఖమ్మం పెద్దాస్పత్రిలో దాదాపు రూ.7కోట్ల అంచనా వ్యయంతో కార్డియాక్ ఎమర్జెన్సీ అండ్ ట్రామాకేర్ సెంటర్ను నెలకొల్పారు. క్యాథ్ల్యాబ్, అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గుండె సమస్యలతో వచ్చిన పేదలకు స్టంట్స్ వేస్తున్నారు. మరో రూ.2.5కోట్లతో 16 ైస్లెస్ సీటీస్కాన్ సౌకర్యాన్ని కల్పించారు.
టీ హబ్లో 57 రకాల వైద్య పరీక్షలు
2021 జనవరిలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ను తెరపైకి తెచ్చారు. ఖమ్మం పెద్దాస్పత్రిలో రూ.2.25కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన హబ్ను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించగా.. 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు. జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పల్లె, బస్తీ దవాఖానల నుంచి సేకరించిన రక్త రమూనాలను పరీక్షించి 24 గంటల్లోనే ఫలితాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు(మే 19 నాటికి) అందిన సమాచారం మేరకు 1,54,600 మంది పేషెంట్ల నుంచి 3,16,500 నమూనాలను సేకరించి 6,99,810 వైద్య పరీక్షలు నిర్వహించారు.
మెడికల్ కళాశాల మంజూరు
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ ఖమ్మానికి మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 100 సీట్లకు అడ్మిషన్లు కల్పించాలనే లక్ష్యంతో పాత కలెక్టరేట్, ఆర్అండ్బీ శాఖ, వైద్యారోగ్య శాఖలకు చెందిన పాత భవనాలను కేటాయించారు. వాటి ఆధునీకరణకు రూ.8.90కోట్లు మంజూరు చేయగా.. యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఆగస్టులో అడ్మిషన్లు జరుగుతాయని సంబంధిత అధికారులు వెల్లడించారు.
పల్లె, బస్తీ దవాఖానలతో ప్రయోజనాలెన్నో..
గ్రామీణ ప్రాంతాల్లో పల్లె, పట్టణాల్లో బస్తీ దవాఖానల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో 161 పల్లె దవాఖానలు నెలకొల్పగా.. వాటిలో 56 మంది ఎంబీబీఎస్ వైద్యులు, 33 మంది బీఏఎంఎస్ వైద్యులు, మరో 72 మంది బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసిన వారు నిరంతరం సేవలు అందిస్తున్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషి కారణంగా రూ.1.17కోట్లతో 9 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయగా.. తొమ్మిది మంది ఎంబీబీఎస్ వైద్యులు, 9 మంది స్టాఫ్ నర్సులను నియమించారు.
కాంతులు పంచిన ‘కంటి వెలుగు’
2018లో కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించగా.. మొదటి దశలో 6,31,361 మందికి స్క్రీనింగ్ చేశారు. దగ్గరి చూపు సమస్య కలిగిన 1,02,350 మందికి రీడింగ్ గ్లాసులు, 66,691 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసులను అందించారు. రెండో విడత కార్యక్రమాన్ని 2023లోనే నగరంలో సీఎం కేసీఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ప్రారంభించారు. తాజా లెక్కల ప్రకారం 6,44,038 మందిని పరీక్షించి 1,27,713 మందికి రీడింగ్ గ్లాసులు, 59,882 మందికి ప్రిస్కిప్షన్ గ్లాసులు పంపిణీ చేశారు.
గర్భిణులకు న్యూట్రిషన్ కిట్స్
తెలంగాణలో గర్భందాల్చిన ప్రతీ మహిళకు పౌష్టికాహారాన్ని అందించాలన్న కోణంలో ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ఏడాది మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవతో 24,048 మంది గర్భిణులకు లబ్ధి చేకూరడం గమనార్హం.
మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట
మహిళల ఆరోగ్య రక్షణకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 18 ఏళ్లు పైబడిన వారందరినీ వారానికి ఒకరోజు పరీక్షించే నిమిత్తం తక్షణ వైద్య సేవలు అందించేందుకు ‘ఆరోగ్య మహిళ’ పేరుతో కార్యాచరణకు పూనుకుంది. వారంలో ప్రతీ మంగళవారం మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే ప్రారంభమైన ప్రక్రియలో 5,800 మంది మహిళలకు సేవలు అందించారు. వారిలో 1,310 రెఫరల్ కేసులుండగా.. 429 మామోగ్రామ్ కేసులను గుర్తించారు.
పీహెచ్సీల ఆధునీకరణకు నిధులు
మంత్రి పువ్వాడ అజయ్కుమార్ చొరవ, సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారంతో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మహర్దశ పట్టింది. సొంత భవనాల నిర్మాణానికి ఒక్కో దానికి రూ.20లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. బనిగండ్లపాడు పీహెచ్సీ నూతన భవనానికి రూ.1.56కోట్లు కేటాయించారు. జాతీయ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా 11 పీహెచ్సీలకు రూ.99లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేశారు.
కొవిడ్ సేవల్లో టాప్..
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్ విభాగాలు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి. మంత్రి పువ్వాడ, కలెక్టర్ల నిత్య పర్యవేక్షణలో సరిపడా రెమిడెసివిర్ ఇంజక్షన్లు తెప్పించారు. ప్రతీ బెడ్కు ఆక్సీజన్ వసతి కల్పించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించారు. ఇంటింటి సర్వేలోనూ బాధితులను గుర్తించి 4,87,300 హోమ్ ఐసోలేషన్ కిట్లను అందజేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా ఫస్ట్ డోస్ వంద శాతం, సెకండ్ డోస్ వంద శాతం పూర్తి చేశారు.
అన్ని రకాల వ్యాధులకు సర్కారు వైద్యం
జిల్లాలో రక్తపోటు కలిగిన 68,112 మంది, మధుమేహ వ్యాధిగ్రస్తులు 45,428 మందికి నిరంతరం మందులు పంపిణీ చేస్తున్నారు. ఓరల్, బ్రెస్ట్, సర్వైవల్ క్యాన్సర్ కోసం 30 ఏళ్లు దాటిన వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. పైలేరియా వ్యాధిగ్రస్తులు 3,592 మంది ఉండగా.. తీవ్రత ఎక్కువగా ఉన్న 1,402 మందికి ఆసరా పింఛన్లు నెలకు రూ.2016 అందుతున్నాయి. ప్రతీ పంచాయతీలో టీబీ క్లబ్స్ను ఏర్పాటు చేసి క్షయ వ్యాధి నివారణకు పటిష్ట చర్యలు చేపట్టారు. మొత్తం 911 మంది వ్యాధిగ్రస్తులకు పింఛన్తోపాటు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బీ.పార్థసారథిరెడ్డి సౌజన్యంతో నెలకు రూ.వెయ్యి విలువైన సరుకులు అందిస్తున్నారు.
ఆశాలకు వేతనాలు పెంపు
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో ఆశ కార్యకర్తకు నెలకు రూ. 9,750 చొప్పున వేతనం అందిస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో 1,345 మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఆశాలు, ఏఎన్ఎంలకు ట్యాబ్లను అందుబాటులోకి తెచ్చారు.
పెద్దాస్పత్రిలో సకల సౌకర్యాలు
నగరంలోని పెద్దాస్పత్రి సకల సౌకర్యాలకు నెలవుగా మారింది. రూ.20కోట్లతో ఎంసీహెచ్ భవనం, రూ.11లక్షలతో లిక్విడ్ ఆక్సీజన్ ప్లాంట్, రూ.16.50లక్షలతో లాట్ 14కే పీఎస్ఏ ప్లాంట్, రూ.2.5కోట్లతో సీటీ స్కాన్ సెంటర్, రూ.25లక్షలతో మదర్ మిల్క్ బ్యాంక్, రూ.38లక్షలతో టీ-హబ్ డయాగ్నస్టిక్ సెంటర్, రూ.కోటితో వైరాలజీ ల్యాబ్(కొవిడ్, ఆర్టీపీసీఆర్ పరీక్షలు), రూ.7కోట్లతో కార్డియాక్ ఎమర్జెన్సీ అండ్ ట్రామాకేర్ సెంటర్, రూ.75లక్షలతో రేడియాలజీ ల్యాబ్, రూ.32లక్షలతో 10 పడకల సామర్థ్యం కలిగిన ఐసీయూ, 20 పడకల డయాలసిస్ సెంటర్, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి జీవితకాలం సేవలందించే నిమిత్తం ప్యాలీయేటివ్ కేర్, ఫిజియోథెరపీ వంటి అనేక రకాల సేవలను అందుబాటులోకి తెచ్చారు.
సర్కారు వైద్యానికి నీరాజనాలు
రెండు దశాబ్దాలుగా జిల్లా వైద్యారోగ్య శాఖలో పలువురు కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. వారిని సీఎం కేసీఆర్ తన హామీ మేరకు రెగ్యులరైజ్ చేశారు. వారిలో 27 మంది వైద్యాధికారులు, 35 మంది మేల్ హెల్త్ అసిస్టెంట్లు, 13 మంది ఫార్మసిస్ట్లు, 16 మంది ల్యాబ్ టెక్నీషియన్లు ఉన్నారు. ఏళ్లతరబడి ఎదురుచూపులకు సీఎం కేసీఆర్ తెరదించిన నేపథ్యంలో వారి ఆనందానికి అవధులు లేవు. అలాగే జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్య సేవలకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ల పర్యవేక్షణలో వైద్యాధికారులు, సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.