ఖమ్మం సిటీ, మే 15: జిల్లాలో క్రీడా సంబురం మొదలైంది. విద్యార్థులు, యువతీ యువకులు అంతా ఆటల్లో నిమగ్నమయ్యారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు, యువకులను సెల్ఫోన్ల నుంచి దూరం చేయాలని, తద్వారా వారి దృష్టిని క్రీడల వైపు మళ్లించాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు బరిలోకి దిగారు. మూడు రోజులపాటు అన్ని మండల, మున్సిపాలిటీల స్థాయిల్లో నిర్వహిస్తున్న సీఎం కప్ ఆటల పోటీల్లో పాల్గొని విజయం కోసం సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగనున్న ఖమ్మం అర్బన్ స్థాయి సోమవారం సీఎం కప్ పోటీలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ప్రారంభించారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి పలు ఆటలు ఆడిన ఆయన క్రీడాకారుల్లో ఉత్తేజాన్ని నింపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన నాడు పటేల్ స్టేడియంలో వసతులు ఘోరంగా ఉండేవని అన్నారు. ఇన్నేళ్లుగా ఒక్కో రంగాన్ని పటిష్టం చేసుకుంటూ వస్తున్నామని, ప్రస్తుతం పటేల్ స్టేడియంలో అద్భుత క్రీడా వసతులు కల్పించామని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, టెన్నిస్, స్కేటింగ్ వంటి క్రీడలకు అంతర్జాతీయ స్థాయిలో కోర్టులు, ఇండోర్ స్టేడియాల నిర్మాణం జరుపుకున్నామని మంత్రి అజయ్ వెల్లడించారు. క్రికెట్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత ప్రాతిపదికన ఇటీవలే ప్లడ్ లైట్లు సైతం ఏర్పాటు చేశామన్నారు. వాటి వెలుగుల్లో రాత్రి పూట కూడా ఆటలు ఆడుకోవచ్చన్నారు. సెల్ఫోన్ల కారణంగా పిల్లల్లో ఫిజికల్ ఫిట్నెస్ దెబ్బతింటున్నదని అన్నారు.
ఈ విషయాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్.. వారిలో శారీరక దృఢత్వాన్ని, మానసికోల్లాసాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో సమ్మర్ క్యాంపులతోపాటు ‘సీఎం కప్’ పోటీలకు రూపకల్పన చేశారని తెలిపారు. మూడు రోజులపాటు మండల స్థాయి, రెండు రోజులపాటు జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. ఇప్పటికే జిల్లాలో ఆరు వేల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో రాణించిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని అన్నారు. విద్యార్థులు, యువతీ యువకులు పట్టుదలతో ఆటలు ఆడుకోవాలని సూచించారు. ఎండలు మండుతున్నందున పోటీలను ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు మాత్రమే నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, పలువురు అధికారులు, పీడీలు, కోచ్లు పాల్గొన్నారు.