ఖమ్మం కమాన్బజార్, జూన్ 1 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త అధ్యాయానికి నాంది పలికారని బ్రాహ్మణ సమాజం కొనియాడుతున్నది. విప్రహిత బ్రాహ్మణ సదనం నిర్మాణం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పేర్కొంటున్నారు. హైదరాబాద్లో ‘విప్రహిత’ ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ బ్రాహ్మణులపై వరాల జల్లు కురిపించడంతో బ్రాహ్మణ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఆలయాల్లో ధూప, దీప, నైవేద్య పథకం మొత్తాన్ని రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు పెంచడం, ఈ పథకంలో కొత్త ఆలయాలను చేర్చడం, వేద పండితులకు గౌరవ భృతి రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచడం, ఐఐఎం, ఐఐటీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, వేద పాఠశాలలకు ఏటా రూ.2 లక్షల గ్రాంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించడంతో ధర్మరక్షకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడుతున్నారు. హిందూ ధర్మాన్ని పాటిస్తూ అన్ని మతాలను సమానంగా చూస్తున్న ఘనత దేశంలో తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుందన్నారు. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవాలనే గొప్ప సంకల్పం కలిగిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లాలో సుమారు 208 ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యం పథకం అమలవుతుండగా మరో 60 ఆలయాలు ఈ పథకంలోకి రానున్నాయి. వీటిలో సుమారు 268 మంది బ్రాహ్మణులు పని చేస్తున్నారు. పేద బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు.
రాష్ట్రంలో బ్రాహ్మణుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి, సేవలు అమోఘం. వేద పండితులకు గౌరవభృతి రూ.5 వేలకు పెంచినందుకు ధన్యవాదాలు. దేశంలో ఏ నాయకుడూ చేయని సాహసాన్ని కేసీఆర్ చేసి చూపించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి నేటి వరకు అనేక ప్రభుత్వాలు పాలించినప్పటికీ బ్రాహ్మణుల గురించి ఆలోచించింది మాత్రం ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే. కేసీఆర్ సేవలను ఎన్నటికీ మరువలేం. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంతోపాటు సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు కృషి చేస్తున్నారు.
– భార్గవాచార్యులు, ధూప, దీప, నైవేద్యం సంఘం జిల్లా కార్యదర్శి, ఖమ్మం
భాగ్యనగరంలో బ్రాహ్మణ సదన్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. భారతీయ సంస్కృతికి మూలం వేదం. సరైన ఆదరణ లేకపోవడంతో కాలక్రమంలో వేద పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. సనాతన సంప్రదాయాలను కాపాడే ఉద్దేశంతో కొందరు వ్యయ ప్రయాసలకోర్చి వేద పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అయితే వీటిలో చాలావరకు దాతల మీదనే ఆధారపడ్డాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత వేద విద్యకు వెన్నుదన్నుగా వేద పాఠశాలలకు రూ.2 లక్షలు అందించడం చాలా గొప్ప విషయం. బ్రాహ్మణుల సంక్షేమంతోపాటు వేద విద్య, సంస్కృత భాషకు పట్టం కడుతున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– ఇంద్రగంటి పవన్కుమార్శర్మ, కొత్తగూడెం
బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆదర్శనీయుడు. దేశవ్యాప్తంగా బ్రాహ్మణుల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్. బ్రాహ్మణులు పేదరికంలో మగ్గిపోతున్నా పార్టీలు కనీస మానవత్వం కూడా చూపని పరిస్థితుల్లో కేసీఆర్ వారి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం సంతోషకరం. ఇతర పార్టీలకు ఇదో గుణపాఠం. బ్రాహ్మణులు ఆర్థిక స్వాలంబన సాధిస్తున్నారు.
– అన్నవజ్జుల ప్రసాద్శర్మ, ఖమ్మం
రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వాటిని విజయవంతంగా అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ మరో ఇరవై యేండ్లు సీఎంగా ఉండాలి. ప్రజల సమస్యలను తానే ముందుగా గ్రహించి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణులపై ప్రత్యేక దృష్టి సారించి వారి సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రకటించడం హర్షణీయం. ధూప, దీప నైవేద్యాలకు నోచుకోని అనేక ఆలయాలకు నెలనెలా నేరుగా ట్రెజరీ నుంచి నిధులు విడుదల చేస్తున్నారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్కు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందని నిరూపించారు. సమాజంలో బ్రాహ్మణుల విలువలు కాపాడి వారి గౌరవాన్ని పెంచారు. ఉద్యోగాలు లేకుండా సతమతమవుతున్న బ్రాహ్మణ యువత గతంలో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, ప్రస్తుతం సీఎం స్వయం సహాయక నిధులను కేటాయించి వారి జీవితానికి భరోసానిస్తున్నారు.
– ఎస్వీఆర్కే ఆచార్యులు, పెద్దమ్మతల్లి ఆలయ ధర్మకర్త, బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు, పాల్వంచ రూరల్
తెలంగాణ రాష్ట్ర కల సాకారమైన తర్వాత అభివృద్ధి జరిగిన అంశాల్లో ఆలయాలు ఒకటి. సీఎం కేసీఆర్ ఆలయాల అభివృద్ధికి ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. బ్రాహ్మణ సదన్ను ఓపెన్ చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్తగా 2,795 ఆలయాలకు ఈ ధూప, దీప, నైవేద్యం సేవా కార్యక్రమాలను అందించనున్నారు. ప్రభుత్వం ద్వారా నెలకు అందే రూ.6 వేలు ఆలయానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. దీన్ని రూ.10 వేలకు పెంచారు. ఆలయాలు బాగుంటే ఊరు, తద్వారా రాష్ట్రం కళకళలాడుతాయి. ఈ విషయాన్ని గమనించి మూసివేయడానికి సిద్ధపడే ఆలయాల్లో కూడా వెలుగులు విరజిమ్మేలా చేస్తున్నారు. సీఎం కలకాలం సుఖశాంతులతో వర్ధ్దిల్లాలి.
– మంత్రవాది అనంతకుమారశర్మ, కొత్తగూడెం
సీఎం కేసీఆర్ పాలనలోనే బ్రాహ్మణులకు గుర్తింపు లభించింది. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటు చేసి శాశ్వత భవనం నిర్మించడంతో ఆయన పేరు ఆచంద్రతారార్కంగా నిలిచిపోతుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత బ్రాహ్మణ సంక్షేమం పట్ల ఆయన చూపించిన శ్రద్ధ, చేసిన యజ్ఞ, యాగాదులు ఆయనకు ప్రాచీన ఆచారాల పట్ల ఉన్న మక్కువకు నిదర్శనం. ధూప, దీప నైవేద్యాలకు నోచుకోని దేవాలయాలకు రూ.10 వేలు అందించడం ఆయనకు హిందూ ధర్మంపై ఉన్న అచంచల భక్తికి నిదర్శనం. భక్తి, ఆధ్యాత్మిక, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఏమాత్రం వెనకడగు వేయని ధీరుడు. గత పాలకులు ఎవరూ దేవాలయాలపై కానీ, బ్రాహ్మణ సంక్షేమంపై కానీ దృష్టి సారించలేదు. అంతేకాక యాదాద్రిని ఆయన పునర్మించిన తీరు అమోఘం. వేద పండితులకు ఇచ్చే గౌరవభృతిని రూ.5 వేలకు పెంచి వారిలో మనోధైర్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. ఎంతోమంది మాటల్లోనే చూపుతారు. సీఎం కేసీఆర్ మాత్రం చేతల్లోనే చూపిస్తారు.
– అమరవాది విజయరాఘవన్, భద్రాద్రి రామాలయం ప్రధానార్చకుడు