ఖమ్మం కల్చరల్, డిసెంబర్ 23: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ఉమ్మడి జిల్లా అభిమానులు, కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. వెండితెరపై వివిధ రకాల పాత్రల్లో నటించిన కైకాల.. తెలుగు సినీ చరిత్రలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకున్నారని పలువురు స్మరించారు. ఆయన మృతి పట్ల ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం కళా పరిషత్ అధ్యక్ష కార్యదర్శులు వీవీ అప్పారావు, డాక్టర్ నాగబత్తిని రవి, ఆర్క్స్ కార్యదర్శి అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, కళాకారులు సదానంద్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కైకాలకు ఖమ్మంతో మరపురాని అనుబంధం ఉంది. 1998లో బోడేపూడి నాటక కళా పరిషత్ ప్రభాత్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక్కడి అభిమానులతో మాట్లాడారు. బ్రహ్మనాయుడు అనే చిత్రంలో కళా పరిషత్ కార్యదర్శి నాగబత్తిని రవితో కలిసి నటించారు. 2004లో ఖమ్మంలో చిత్రీకరించిన ‘భారతంలో శంఖారావం’ సినిమాలో నటించడానికీ విచ్చేశారు.