మణుగూరు టౌన్, ఏప్రిల్ 1: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రజల్లో ఆదరణ ఏమాత్రమూ తగ్గలేదని, అడుగడుగునా ప్రజల నీరాజనాలు అందుతుండడమే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజల్లోకి వస్తుంటే కాంగ్రెస్ మంత్రులకు భయం పుట్టుకొస్తోందని విమర్శించారు. అందుకే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రైతుల పంటల పరిశీలన కోసం ఉమ్మడి నల్లగొండలోని సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల పర్యటించడం, ప్రభుత్వ తీరును ఎండగట్టడం వంటి అంశాలపై నల్లగొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రేగా కాంతారావు సోమవారం సోషల్మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజల్లోకి వస్తే తమకు ఎక్కడ ఆదరణ పోతుందోనని భయం కాంగ్రెస్ మంత్రులకు పట్టుకుందని విమర్శించారు. అందువల్లనే వారు ఆవేశం, ఆందోళనతో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇన్నేళ్ల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా నల్లగొండలోనే ఫ్లోరైడ్ భూతాన్ని ఎందుకు పట్టించుకోలేదని విమర్శించారు. ఫ్లోరైడ్ సమస్యతో ప్రజల జీవితాలతో ఆడుకున్నందుకు సిగ్గుపడాల్సింది పోయి కేసీఆర్పై ఎదురుదాడి చేస్తుండడం హేయమైన చర్య అని అన్నారు.
పైగా తమ పాపాలు మరిచి నీతివ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మంత్రులు చేసిన ఇలాంటి వ్యాఖ్యలను చూసి ప్రజలు కూడా నవ్వుకుంటున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ భూతాన్ని పారదోలి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. సాగర్ జలాలను నల్లగొండ ప్రజలకు అందించడం చేతకాని కాంగ్రెస్ మంత్రులకు కేసీఆర్ను విమర్శించే అర్హత లేదని అన్నారు. ఉమ్మడి నల్లగొండను మూడు జిల్లాలుగా చేసి మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కరెంటు లేక చీకట్లు అలుముకుంటే.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక 4 వేల మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంటును తీసుకొచ్చారని గుర్తుచేశారు. తెలంగాణను తెచ్చిన కేసీఆర్.. పదేళ్లపాటు సీఎంగా సుపరిపాలన అందించారని అన్నారు. ఇప్పటి కాంగ్రెస్ మంత్రులు చెబుతున్న అబద్ధాలను, చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ తీరును ఎండగడుతూ రేగా చేసిన పోస్టులు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.