భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/అశ్వారావుపేట, జనవరి 27 : పంచాయతీల్లో పాలకవర్గాల పాలన ఐదు రోజుల్లో ముగియనున్నది. ఈ నెలాఖరు వరకే గడువు. మరోవైపు కనుచూపు మేరలో పంచాయతీ ఎన్నికలు జరిగే పరిస్థితే కనిపించడం లేదు. ఎన్నికల నిర్వహణ జరగాలంటే యంత్రాంగానికి తక్కువలో తక్కువ నెల రోజుల సమయం కావాలి. ప్రస్తుతం అంత సమయం లేనందున ‘పల్లె పోరు’కు బ్రేక్ పడినట్లు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక పంచాయతీల్లో రాష్ట్రప్రభుత్వం పెత్తనం ఎవరికి అప్పగిస్తుందో వేచి చూడాల్సిందే. పర్సన్ ఇన్చార్జులను నియమిస్తారా? లేదా ప్రత్యేక అధికారులను నియమిస్తారా? అనే అంశం ప్రస్తుతం సందిగ్ధంలో ఉన్నది.
బీఆర్ఎస్ హయాంలోనే పంచాయతీల పెంపు..
ఉమ్మడి పాలనలో పంచాయతీలకు సొంత భవనాలు లేక పంచాయతీ కార్యదర్శుల నియమకాలు లేక పాలన అస్తవ్యస్తంగా ఉండేది. నాలుగైదు పంచాయతీలకు కలిపి ఒక సీనియర్ పంచాయతీ కార్యదర్శి పాలన కార్యకలాపాలు నిర్వహించేవారు. తెలంగాణ వచ్చాక గత కేసీఆర్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకువచ్చి పంచాయతీ వ్యవస్థకు కొత్త రూపు తెచ్చింది. మారుమూల గిరిజన తండాలు, గూడేలకు పంచాయతీ హోదా కల్పించింది. గ్రామాల్లో అభివృద్ధికి బాటలు వేసింది. గ్రామస్థాయిలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా ఇట్టే పరిష్కరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలన అస్తవ్యస్తంగా మారింది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో.. కొత్త పాలకవర్గాలు ఎప్పుడు చార్జ్ తీసుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు తారుమారు అవుతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలను పట్టించుకోవడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.
రిజర్వేషన్లపై మల్లాగుల్లాలు..
గత కేసీఆర్ ప్రభుత్వం కొత్త పంచాయతీ రాజ్చట్టం తీసుకువచ్చి రెండు దఫాల పాటు పంచాయతీ ఎన్నికలకు ఒకే రిజర్వేషన్ వర్తించేలా చట్టం తీసుకు వచ్చింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు ఇదే రిజర్వేషన్ అమలు చేస్తుందా..? లేక కొత్త రిజర్వేషన్లకు ఏమైనా శ్రీకారం చుడుతుందా..? అనే విషయం ఇకముందు తేలనున్నది. ఈ విషయం తేల్చేందుకు సర్కార్ మల్లాగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తున్నది.
ఇక ప్రత్యేక పాలనే గతి..
2018 ఆగస్టు 1న పంచాయతీల్లో పాలకవర్గాల గడువు ముగిసింది. ఇదే ఏడాది ఆగస్టు 2 నుంచి ప్రత్యేక పాలన అమలులోకి వచ్చింది. 2019 జనవరిలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 2న కొత్త పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. వచ్చే నెల 1న పాలకవర్గాల గడువు ముగుస్తుంది. ‘పల్లె పాలన’పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో అధికారులూ ఇప్పటివరకు అయోమయంలోనే ఉన్నారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు..
పంచాయతీ ఎన్నికలపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. అలాగే పాలకవర్గాల గడువు ముగిసిన తర్వాత పంచాయతీల్లో పాలన ఎలా సాగుతుందనే అంశంపైనా స్పష్టత లేదు. అలాగే రిజర్వేషన్ల పైనా కసరత్తు జరగాల్సి ఉంటుందేమో. ఫిబ్రవరి నుంచి గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగే అవకాశం కనిపిస్తున్నది. గ్రామాల్లో గతంలో నిర్వహించాల్సిన కొన్ని ఉప ఎన్నికలు కూడా నిలిచిపోయాయి.
– రమాకాంత్, డీపీవో, భద్రాద్రి జిల్లా