వచ్చే నెల 3న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ వారి సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. క్లిష్టతరమైన ప్రశ్నలను సులభమైన పద్ధతిలో రాసే విధానాన్ని బోధిస్తున్నారు. స్పెషల్ క్లాసులు నిర్వహించే సమయంలో విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన అభ్యాస దీపికలను ప్రాక్టీస్ చేయిస్తున్నారు.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 5: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదోతరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు జిల్లావిద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నది. ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, స్లిప్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అన్ని సబ్జెక్టులను రివిజన్ చేయిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి పాఠ్యాంశాలపై వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. క్లిష్టతరమైన ప్రశ్నలను సులభమైన పద్ధతిలో రాసే విధానాన్ని బోధిస్తున్నారు. స్పెషల్ క్లాసులు నిర్వహించే సమయంలో విద్యార్థులకు స్నాక్స్ అందిస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన అభ్యాస దీపికలను ప్రాక్టీస్ చేయిస్తున్నారు.
గత అనుభవాల దృష్ట్యా..
జిల్లాలోని మొత్తం 110 ప్రభుత్వ పాఠశాలల పరిధిలో 4,058 మంది, అలాగే ప్రైవేటు, ఎయిడెడ్ యాజమాన్యాల పరిధిలో 8,432 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. వీరందరి కోసం విద్యాశాఖ జిల్లావ్యాప్తంగా 71 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతేడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి పదోతరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. డీఈవో సోమశేఖరశర్మ ఎప్పటికప్పుడు పాఠశాలలను సందర్శిస్తూ హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సలహాలు, సూచనలిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థుల్లో ఎక్కువ మందికి ఇంగ్లిష్, గణితం, ఫిజిక్స్, బయాలజీలో తక్కువ మార్కులు వస్తున్నాయని గుర్తించి సబ్జెక్ట్ ఉపాధ్యాయులు ఈజీ మెథడ్లో బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్న సమయంలో స్నాక్స్ అందించేందుకు ప్రభుత్వం రోజుకు ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున నిధులు విడుదల చేస్తున్నది. దీంతో ప్రతిరోజూ 4,058 మందికి రెండు పూటలా స్నాక్స్ అందుతున్నాయి.
తల్లిదండ్రులకు సూచనలివీ..
విద్యార్థుల పురోగతిపై యాజమాన్యాలు 15 రోజులకోసారి సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశాలు మార్చి నెలలో 18, 31వ తేదీల్లో జరుగనున్నాయి. సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు హాజరుకావాలి. ఉపాధ్యాయులతో పరీక్షలపై చర్చించాలి. విద్యావేత్తలు, సబ్జెక్ట్ నిపుణులు, విద్యాశాఖ అధికారులు హాజరవుతారు. పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి, పరీక్షలు ఎన్నో విషయాలు తెలియజేస్తారు. వాటన్నింటిపై అవగాహన పెంచుకోవాలి. పిల్ల పరీక్షలు పూర్తయ్యేంతవరకు సమయపాలన పాటించే విధంగా చూసుకోవాలి. ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగునున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రానికి 30 నిమిషాల ముందుగానే పిల్లలను చేర్చే విధంగా చూసుకోవాలి.
నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదోతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నది. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. ప్రతి విద్యార్థికీ స్నాక్స్ అందిస్తున్నాం. విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో అభ్యాస దీపికలు అందించాం. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
– సోమశేఖరశర్మ, జిల్లావిద్యాశాఖ అధికారి, కొత్తగూడెం