ఖమ్మం/కొత్తగూడెం టౌన్, అక్టోబర్ 22: చెడుపై మంచి సాధించిన విజయమే. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు నిర్వహించే పండుగ దసరా. మన తెలంగాణలో ఇదే అతిపెద్ద పండుగ. కుల మతాలకు అతీతీంగా జరపుకొనే వేడుక ఇది. సోమవారం ఉమ్మడి జిల్లాప్రజలు పండుగను ఘనంగా జరుపుకోనున్నారు. ప్రత్యేక పూజలకు స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, పారువేటకు జమ్మిబండ ముస్తాబయ్యాయి. నిర్వాహకులు ఆలయంతోపాటు జమ్మిబండను విద్యుద్దీపాలతో అలంకరించారు.
మహిమాన్వితం..స్తంభాద్రి స్థల పురాణం..
ఖమ్మంలోని ప్రాచీన క్షేత్రమైన స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఘనమైన చరిత్ర ఉంది. దీని ప్రకారం.. ఖమ్మం పరిసర ప్రాంతంలోని అష్ణగుర్తికి చెందిన భూపతి వెంకమ్మ అనే మహిళకు నర్సింహస్వామి కలలో సాక్షాత్కరించి ‘నేను నర్సింహాస్వామిని ఇక్కడి గుట్టపైన కొలువుదీరి ఉన్నాను. నన్ను గుర్తించి నాకు ఆలయాన్ని నిర్మించండి’ చెబుతాడు’. వెంకమ్మ స్వప్న వృత్తాంతాన్ని గ్రామస్తులందరికీ ఆమె తెలియజేస్తుంది. తర్వాత గ్రామస్తులంతా కలిసి ఖమ్మంలోని గుట్టపై లక్ష్మీసమేత నర్సింహాస్వామి విగ్రహాన్ని గుర్తిస్తారు. ఈ విషయాన్ని రెడ్డి రాజులకు తెలియజేస్తారు. పాలకులు రంగంలోకి దిగి ఆలయ నిర్మాణానికి పూనుకుంటారు. రమారమి క్రీ.శ 591లో ఆలయ నిర్మాణం పూర్తయింది. లక్ష్మీ సమేతుడై స్వయంభుగా వెలసిన శ్రీలక్ష్మీనర్సింహాస్వామి ఖమ్మం ప్రజల కొంగు బంగారంగా మారాడు. నాటి నుంచి ప్రజల ఇలవేల్పుగా కొనసాగుతున్నాడు.
జమ్మిబండ వద్ద పారువేట..
ఖమ్మం ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు నాటి పాలకుడు లక్ష్మారెడ్డి తవ్వించిన చెరువే నేటి లకారం చెరువు. విజయదశమి పర్వదినాన స్వామివారు లక్ష్మీ సమేతుడై గ్రామాంతరం వెళ్లే ఉత్సవమే జమ్మిబండ పారువేట స్థలం. రెడ్డి రాజుల కాలంలోనే ఉత్సవ మూర్తులను దట్టమైన అటవీ ప్రాంతమైన జమ్మిబండ ప్రాంతంలోని శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దకు ఊరేగింపుగా తీసుకొచే సంప్రదాయం ప్రారంభమైంది. జమ్మిబండ ప్రాంతం ప్రస్తుత జడ్పీ సెంటర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల వరకూ ఉండేది. నాడు లకారం చెరువు ఒడ్డున జమ్మిబండ ప్రాంతం ఉండేది. గుట్టపై వెలసిన స్తంభాద్రి నర్సింహస్వామిని పండుగ రోజున దర్శించుకునేందుకు వీలు కాని భక్తులు స్వామిని దర్శించుకోవడానికి నిర్మించిన ప్రత్యామ్నాయ వేదికే జమ్మిబండ. అప్పట్లోనే పాలకులు చిన్న మండపం నిర్మించారు. దశాబ్దాల నుంచి ఏటా దసరా సందర్భంగా ఈ పారువేట మహోత్సవం జరుగుతూ వస్తున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి స్థానిక ప్రభుత్వాలే దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నాయి. ముస్లిం రాజుల పాలనలోనూ అధికారంగా జరిగేవంటే మత సామరస్యం ఎలా పరిఢవిల్లిందో అర్థం చేసుకోవచ్చు. 1952లో పట్టణ ప్రముఖుడు పంతం రాములు జమ్మిబండ వద్ద స్వామివారి కల్యాణ మండప నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తర్వాత ఆయన కుమారుడు పంతం కోటిలింగం ఆ బాధ్యతలు తీసుకున్నారు. తన శక్తియుక్తులతోపాటు ఇతర కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో 1993 అక్టోబర్ 24న మండప నిర్మాణం పూర్తి చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మొర్రేడు వాగు, రైటర్ బస్తీ, రామవరం, రుద్రంపూర్, పెద్దమ్మతల్లి ఆలయం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఘనంగా దసరా ఉత్సవాలు జరుపుకునేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద దసరా ఉత్సవాన్ని ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు.