మధిర, సెప్టెంబర్ 11 : హింస, వెట్టి చాకిరి, అణచివేత నుండి పుట్టిన చైతన్యమే తెలంగాణ సాయుధ పోరాటం అని సిపిఐ ఖమ్మం జిల్లా కార్యవర్గ సభ్యుడు బెజవాడ రవిబాబు అన్నారు. గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు తొండల గోపవరం గ్రామంలోని రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్లమల గిరిప్రసాద్ స్మారక వద్ద ప్రారంభమయ్యాయి. ముందుగా సిపిఐ నేతలు గిరి ప్రసాద్ స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారోత్సవాలకు సూచికగా అరుణ పతాకాన్ని బెజవాడ రవిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర గొప్పదన్నారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి కోసం తమ ప్రాణాలు అర్పించి పోరాటం కొనసాగించారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల, బయ్యారం, ఇల్లెందు ప్రాంతాల్లో నిజాం సర్కార్కు వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగినట్లు తెలిపారు.
దీంతో రజాకార్ల తూటాలకు 50 మంది దాకా బలయ్యారని వారి మృతదేహాలను గ్రామాల్లో ఊరేగించి పైశాచికానందం పొందారన్నారు. మధిర నియోజకవర్గంలో ప్రతి ఊరు నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిందని మధిర పక్కనుండే అల్లీనగరం గ్రామస్తులు రజాకార్లను తరిమి తరిమి కొట్టారన్నారు. తర్వాత రజాకార్లు మరింత సేనలతో వచ్చి ఇళ్లు తగలబెట్టిన సంఘటన ఉన్నాయన్నారు. గోవిందపురంలోఇలాంటి ఘటనే జరిగిందని తెలిపారు. రజాకార్ల అరాచకాలతో చితికిపోయిన బతుకులన్నీ కమ్యూనిస్టు నాయకుల పిలుపుతో బంధూకులు పట్టి ముందుకు కదిలారాన్నారు. పలుగు, పారా, కారం, రోకలి బరిసెలు ఇలా ఏది దొరికితే అది పట్టుకొని ఆడ, మగ అనే తేడా లేకుండా అంతా సాయుధులై పోరాటాలు చేశారన్నారు. నిజాం పోలీసులకు రాజాకారులకు కమ్యూనిస్టులు, ఉద్యమకారులు చమటలు పట్టించారని తెలిపారు.
ఈ పోరాటంలో మధిర ప్రాంతం నుండి నల్లమల గిరి ప్రసాద్, వాసిరెడ్డి వెంకటపతి ఇంకా అనేక మంది నేతలు రజాకారులను తరిమి కొట్టారని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా ఈ ప్రాంతంలో 10 లక్షల ఎకరాల భూములను పేదవారికి పంచినట్లు గుర్తు చేశారు. నాలుగు వేల మంది అమరవీరుల బలిదానంతో స్వరాజ్యాన్ని సాధించారన్నారు. రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు పెరుమాళ్లపల్లి ప్రకాశ్ రావు, సిపిఐ సీనియర్ నాయకులు మంగళగిరి రామాంజనేయులు, చెరుకూరి వెంకటేశ్వర్లు, మడుపల్లి లక్ష్మణ్, తలారి రమేశ్, కొండూరి నాగేశ్వర్రావు, రంగు నాగ కృష్ణ, పరుచూరి రాము, జిల్లా బ్రహ్మం, గోపి పాల్గొన్నారు.