ఖమ్మం, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మంచి చేయాలని.. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి చూడాలని తలుస్తుంటే.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై అందుకు సంబంధించిన బిల్లును పెండింగ్లో పెట్టడం సరికాదంటూ.. ఆమె తీరును తప్పుపడుతూ ఆర్టీసీ కార్మికులు శనివారం రోడ్డెక్కారు. నల్లబ్యాడ్జీలు ధరించి డిపోల ఎదుట బైఠాయించారు. బస్సులను డిపో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆరు ఆర్టీసీ డిపోల ఎదుట కార్మికులు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు గవర్నర్ తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ తమ జీవితాల్లో వెలుగులు నింపాలని చూస్తే ఓర్వలేకపోవడం సరికాదని, బిల్లును అడ్డుకుంటే తీవ్రంగా నష్టపోతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.
గవర్నర్ తమిళసైపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటూ ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పొద్దున్నే డిపోలకు చేరుకొని బస్సులను బయటకు రాకుండా బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ, ఆ సంస్థ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్కు పంపింది. ఈ బిల్లుకు గవర్నర్కు ఆమోదం తెలుపలేదు. అయితే బిల్లును గవర్నర్ ఆమోదించినట్లయితే తాము ప్రభుత్వంలో భాగస్వాములం అవుతామని అన్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులం కాకూడదనే ఉద్దేశంతో గవర్నర్ వ్యవహరించడం సరికాదని అన్నారు. ఆర్టీసీ బిల్లు ఆమోదంలో తాత్సారం చేస్తున్న గవర్నర్ తీరును నిరసిస్తూ ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులు శనివారం ఉదయమే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల బైఠాయించి గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం 6:45 గంటల నుంచి 8:45 గంటల వరకు ఖమ్మం డిపో ఎదుట ధర్నా చేస్తూ బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. రాజకీయాలు చేయాలనుకుంటే గవర్నర్ ఆ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పాలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.