సత్తుపల్లి, ఆగస్టు 11 : సమైక్య రాష్ట్రంలో కులవృత్తులకు ప్రోత్సాహం కరువైంది. సాయం చేసే నాథుడు కనుచూపు మేరలో కనిపించలేదు. వృత్తినే నమ్ముకున్నా ఆదరణ లేక.. చేతినిండా పనిలేక పూట గడవక కుటుంబాలు పస్తులున్న సందర్భాలున్నాయి. కార్పొరేట్ షాపింగ్ మాల్స్, ఆధునిక యంత్రాల రాకతో కులవృత్తులు కునారిల్లిపోయాయి. ఇలాంటి తరుణంలో అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ సాయం అందిస్తున్న సీఎం కేసీఆర్ కులవృత్తిదారులను ఆదుకునేందుకు రూ.లక్ష ఆర్థిక సాయాన్ని అందిస్తూ భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం సత్తుపల్లి నియోజకవర్గవ్యాప్తంగా మంజూరైన 300 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. తమకు ప్రభుత్వం రూ.లక్ష సాయం చేయడంతో వృత్తిలో నైపుణ్యం సాధించి ఆర్థిక పరిపుష్టి సాధిస్తామని పలువురు కులవృత్తిదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమకు, తమ కుటుంబాలకు భరోసా కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఆదుకున్న దేవుడు కేసీఆర్
సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మా దుకాణాలకు ఉచిత విద్యుత్ మీటర్లు ఇవ్వడమే కాకుండా కులవృత్తిదారులను గుర్తించి రూ.లక్ష సాయం చేశారు. కులవృత్తులను కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఆపద్బాంధవునిగా నిలిచారు.
-పారంపూడి సూర్యప్రకాశ్, నాయీబ్రాహ్మణుడు, రేజర్ల, సత్తుపల్లి మండలం
ఆర్థిక భరోసా లభించింది
కులవృత్తులను నమ్ముకుని జీవనం సాగిస్తున్న మాలాంటి వారికి ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో భరోసా కలిగింది. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. ప్రభుత్వం ఇచ్చిన సాయంతో మా వృత్తిని పెంచుకుని ఆర్థికంగా నిలబడతాం.
-ఎరుమళ్ల సుహాసిని, శాలివాహన, ఏరుగట్ల, పెనుబల్లి మండలం
సీఎంకు రుణపడి ఉంటాం
రూ.లక్ష ఆర్థిక సాయం చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం. నాలాంటి బీసీ కులవృత్తుల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించడంతో మా కుటుంబానికి భరోసా లభించింది. ప్రభుత్వం అందించిన రూ.లక్షతో ఇస్త్రీ షాపు ఏర్పాటు చేసుకుంటాం. సాయం అందించిన సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరిచిపోం.
-వెంకట నాగసునీత, రజక, చండ్రుపట్ల, కల్లూరు మండలం
కేసీఆర్ మాటంటే మాటే
సీఎం కేసీఆర్ కులవృత్తుల వారికి రూ.లక్ష సాయం అందిస్తామని ప్రకటించడంతో అది నిజమవుతుందని నమ్మలేదు. కానీ.. శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర చేతులమీదుగా రూ.లక్ష చెక్కును అందుకున్నాక చాలా సంతోషం కలిగింది. సీఎం కేసీఆర్ మాట ఇస్తే అది నిజమైపోతుంది. మాకు భరోసా కల్పించిన నాయకుడు కేసీఆర్.
-రేపాకుల నాగమణి, చాకలి, లక్ష్మీపురం, తల్లాడ మండలం