తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సందడిగా సాగుతున్నాయి.. ఏడురోజుల పాటు ఘనంగా సాగిన ఉత్సవాలు శుక్రవారం ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. బూర్గంపహాడ్ మండలం సారపాక వేడుకలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, దమ్మపేటలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, మధిర పట్టణంలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం రూరల్ మండలంలోని పోలెపల్లిలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, పెనుబల్లిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. సంక్షేమ సంబురంలో భాగంగా లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, బీసీ రుణాలు, ఇండ్ల పట్టాలు అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉభయజిల్లాల్లో సుపరిపాలన దినోత్సవం జరుగనున్నది.
– నమస్తే నెట్వర్క్
మధిర టౌన్, జూన్ 9: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. మధిర పట్టణంలోని రెడ్డిగార్డెన్స్లో శుక్రవారం ఆయన రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి లబ్ధిదారులకు రుణాలు, ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. పేదింటి ఆడబిడ్డల వివాహానికి సీఎం కేసీఆర్ మేనమామలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు పథకం వర్తించిందన్నారు. బోదకాలు బాధితులు, ఒంటరి మహిళల కు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. కేసీఆర్ కిట్, దళితబంధు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ అమలు కావడం లేదన్నారు. అభినవ అంబేద్కర్గా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఎస్సీల అభ్యున్నతికి ప్రతిష్ఠాత్మకంగా దళితబంధు పథకం అమలుచేస్తున్నారన్నారు.
రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం బీసీలకు రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నదన్నారు. కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 2 వేల మందికి ఇండ్ల పట్టాలు అందిస్తున్నామన్నారు. ఎర్రుపాలెం మండలం నుంచి ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారన్నారు. బీసీ రుణాలకు కుమ్మరి, వడ్డెర, వడ్రంగి, నాయీబ్రాహ్మణ, రజకులు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లు అందుతా యన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాధికా గుప్తా, మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, ఆత్మకమిటీ చైర్మన్ గుర్రం రామారావు, ఎంపీపీ మెండెం లలిత తదితరులు పాల్గొన్నారు.
వైరా టౌన్, జూన్ 9: రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అద్భుతమని, దేశానికి ఆదర్శమని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం వినూత్న పథకాలకు రూపకల్పన చేయడంలో, వాటిని విప్లవాత్మకంగా అమలు చేయడంలో సీఎం కేసీఆర్ రోల్మోడల్గా నిలిచారని అన్నారు. తెలంగాణలో ఆయన రూపొందించిన పథకాలను నేడు అనేక రాష్ర్టాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా వైరాలోని ఎన్వీఎస్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ సిద్ధించాక సీఎం కేసీఆర్ రూపొందించిన రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, దళితబంధు వంటివి సంక్షేమ దేశానికి దిక్సూచిగా నిలిచాయని అన్నారు.
ఒకనాడు కనీస చేయూత అందక చితికిపోయిన చేతివృత్తులు నేడు బీఆర్ఎస్ సర్కారు అండతో పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సబ్బండ వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. వారి ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ.. లబ్ధిదారులందరూ ప్రభుత్వ పథకాలను వినియోగించుకొని ఆర్థికంగా స్థిరపడాలని సూచించారు. అనంతరం కులవృత్తుల వారికి రాష్ట్ర ప్రభుత్వం పంపిన రూ.లక్ష ఆర్థికసాయం చెక్కులు, రెండో విడత గొర్రెలు, ఇళ్ల స్థలాల పట్టాలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే, కలెక్టర్ కలిసి పంపిణీ చేశారు. అదనపు కలెక్టర్ స్నేహలత, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇల్లెందు రూరల్, జూన్ 9 : వెనుకబడిన వర్గాలు, కులవృత్తుల వారిని ప్రోత్సహించేందుకే సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేస్తున్నారని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ అన్నారు. శుక్రవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మార్కెట్ యార్డులో సంక్షేమ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కులవృత్తులు చేసుకునే ఐదుగురికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ ఆర్థిక అందజేస్తున్నారన్నారు. బీసీ కులవృత్తుల వారు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున సహాయం అందిస్తున్నారన్నారు. కులవృత్తులు, చేతివృత్తులు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గతంలో వృద్ధులకు రూ.200 పెన్షన్ వచ్చేదని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నెలకు రూ.2,016లను సీఎం కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. అలాగే నెలనెలా వితంతువులకు రూ.2,016, దివ్యాంగులు, ఎయిడ్స్, బోదకాలు, డయాలసిస్ బాధితులకు, కల్లుగీత, చేనేత కార్మికులకు పింఛన్లు అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో 44,82,682 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నారన్నారు.
దళితబంధుతో 38,323 మంది లబ్ధి పొందారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో 12 లక్షలకు పైగా కుటుంబాలు లబ్ది పొందాయన్నారు. 9,47,200 మంది గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తున్నారన్నారు. 65 లక్షల మంది రైతు ఖాతాల్లో రూ.65వేల కోట్ల రైతుబంధును జమ చేశారన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ను అందిస్తున్నారన్నారు. కేసీఆర్ కిట్తో 13,91,000 మంది బాలింతలు లబ్ధి పొందారన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదన్నారు. ప్రజలందరూ మరోసారి బీఆర్ఎస్ను గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జడ్పీ చైర్మన్ అంగోత్ బిందు, నోడల్ అధికారి సబిత, తహసీల్దార్ కృష్ణవేణి, సీడీపీవో లక్ష్మీప్రసన్న, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి పులిగళ్ల మాధవరావు, మెప్మా అధికారి యశోద, వైస్ చైర్మన్ జానీపాషా, డీసీసీబీ డైరెక్టర్ జనగాం కోటేశ్వర్రావు, లాల్సింగ్, భావ్సింగ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.