ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 28: అది ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల. సమయం మధ్యాహ్నం 3 గంటలు. అక్కడకి జిల్లా విద్యాశాఖాధికారి వచ్చారు. నేరుగా పాఠశాలలోని టెన్త్ క్లాస్ గదిలోకి వెళ్లారు. ఆ సమయానికి విద్యార్థులు చదువుకుంటున్నారు. ‘ఏమి చదువుతున్నారు?’ అని విద్యార్థులను అడిగారు డీఈవో. కొందరు మ్యాథ్స్ అని, మరికొందరు ఫిజిక్స్ అని చెప్పారు. దీంతో ఆయా సబ్జెక్టులనుంచి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు డీఈవో. వారు చెప్పిన ఆన్సర్లకు మరింత వివరణాత్మకంగా సమాధానమిచ్చారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడిగా మారి మ్యాథ్స్, ఫిజిక్స్ బోధించారు.
విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. సుమారు 40 నిమిషాలపాటు పాఠం చెప్పారు. ఆయనే.. ఖమ్మం డీఈవో సోమశేఖరశర్మ. ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియలో బిజీగా ఉన్నప్పటికీ.. శనివారం రాజీవ్ గృహకల్పకాలనీ ఎంపీపీఎస్ను, నయాబజర్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకుంటూ వారితోనే బోర్డుపై రాయించారు. అనంతరం హెచ్ఎం గాయత్రి నుంచి విద్యార్థుల ఎఫ్ఏల ఫలితాలు తెలుసుకున్నారు. విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషిచేయాలని, ప్రత్యేక తరగతుల్లోనూ వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.