తెలంగాణ ప్రభుత్వం మాతాశిశు సంక్షేమంతోపాటు గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించింది. ఈ మేరకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నది. అంతేకాదు, చిన్నారులకు బలవర్థకమైన ఆహారం అందించడంతోపాటు వారి విద్యావికాసానికి బాటలు వేస్తున్నది. అంగన్వాడీల్లో ఆంగ్లబోధన ప్రవేశపెట్టి చిన్నారుల ఉన్నతికి కృషి చేస్తున్నది. పిల్లలకు ప్రత్యేక పుస్తకాలు అందిస్తూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బోధన అందిస్తున్నది. త్రైమాసిక పద్ధతిన విద్యార్థుల ప్రతిభా నివేదికలను వారి తల్లిదండ్రులకు పంపుతున్నది. మెరుగైన ఆంగ్ల విద్య అందుబాటులోకి రావడంతో తల్లిదండ్రులందరూ తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకే పంపుతున్నారు. దీంతో గ్రామాల్లోని చిన్న చిన్న కాన్వెంట్లన్నీ క్రమంగా కనుమరుగవుతున్నాయి.
ఖమ్మం వ్యవసాయం, మార్చి 27: అంగన్వాడీలంటే శిశు సంక్షేమం, గర్భిణుల ఆరోగ్యం, బాలింతల బాగోగులు మాత్రమే కాదు.. అంతకుమించి ఇంకా ఎంతో ఉంది. ఇంకా చెప్పాలంటే కేవలం చిన్నారులకు బలవర్థక ఆహారం అందించడం మాత్రమే కాకుండా వారి విద్యా వికాసానికీ బాటలు వేస్తున్నాయి. అందునా.. ఇంకా ముఖ్యమైన ఆంగ్లబోధనకు పెద్దపీట వేస్తున్నాయి. చిన్నారులకు ప్రత్యేక పుస్తకాలు అందిస్తూ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ బోధన అందిస్తున్నాయి. త్రైమాసిక పద్ధతిన విద్యార్థుల ప్రతిభా నివేదికలను కూడా తల్లిదండ్రులకు పంపుతున్నాయి. తమ ఇంటి పరసరాల్లోనే మెరుగైన ఆంగ్ల విద్య అందుతుండడంతో తల్లిదండ్రులందరూ తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకే పంపుతున్నారు. దీంతో గ్రామాల్లోని చిన్న చిన్న కాన్వెంట్లన్నీ క్రమంగా కనుమరుగవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకంతో కూడా అంగన్వాడీ కేంద్రాలకు జవసత్వాలు వచ్చాయి.
ప్రీ స్కూల్ చిన్నారులకు ఆంగ్లబోధన..
3 6 ఏళ్లలోపు (ప్రీ స్కూల్) పిల్లల విద్యపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆంగ్లబోధనను తీసుకొచ్చింది. ప్లేకార్డులు, పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి తెచ్చింది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఆంగ్లబోధన అందిస్తోంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల పురోగతిని ప్రోగ్రెస్ కార్డుల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లోనే చిన్నారులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పూర్తి చేయిస్తోంది. అనంతరం సమీప పాఠశాలల్లో చేర్పిస్తోంది.
నలతగా అనిపిస్తే ప్రత్యేక నజర్..
చదువులోనూ, సంపూర్ణ ఆరోగ్యంలోనూ వెనుకబడిన పిల్లల పట్ల ఐసీడీఎస్ ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది. పోషణ్ అబియాన్ పేరిట ఇంటింటికీ వెళ్లి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్న అంగన్వాడీ టీచర్లు.. కుటుంబీకుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. రక్తహీనత, బరువు తక్కువ, పోషణ లోపం కలిగిన చిన్నారులను గుర్తించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
‘ఆరోగ్యలక్ష్మి’తో జవసత్వాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం అంగన్వాడీ కేంద్రాలకు జవసత్వాలు తీసుకొచ్చింది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖలోని 7 ప్రాజెక్టుల్లో 1,837 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటి ద్వారా 9,016 మంది గర్భిణులు, 10,323 మంది బాలింతలకు సేవలందిస్తున్నారు. చిన్నారులకు బాలామృతం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో గర్భిణి/ బాలింతకు రోజుకు రూ.21 చొప్పున, చిన్నారులకు రోజుకు రూ.7 చొప్పున వెచ్చిస్తున్నారు. దీంతో జిల్లాలో బాలింతలు, గర్భిణులు, చిన్నారుల సంక్షేమం కోసం ఒక్కో రోజుకు ప్రభుత్వం రూ.6,32,969 వెచ్చిస్తున్నట్లవుతోంది. గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ ఒక కోడిగుడ్డు, 200 గ్రాముల పాలతోపాటు రోజుకోరకమైన ఆకుకూరలు, కాయగూరలతో కూడిన భోజనాన్ని అందిస్తోంది. చిన్నారులకు కూడా రోజూ ఒక కోడి గుడ్డు, మధ్యాహ్న భోజనాన్ని అందిస్తోంది. నాణ్యమైన విద్యతోపాటు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తుండడంతో అంగన్వాడీ కేంద్రాలు మరింత బలోపేతమవుతున్నాయి.
పూర్వప్రాథమిక విద్యతోపాటు ఆంగ్లభోదన
జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనూ పూర్వ ప్రాథమిక విద్యతోపాటు సులభతర పద్ధతిలో ఆంగ్లబోధనను కూడా అందిస్తున్నాం. ప్రీ స్కూల్ పిల్లలకు ఆంగ్లం సులభంగా అర్థమయ్యేలా బోధిచేందుకు టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చాం. దీంతో ప్రాథమిక విద్యలో చేరిన అంగన్వాడీ పిల్లలలో ఎంతో సృజనాత్మక కన్పిస్తోంది. ఒకవైపు నాణ్యమైన విద్యతో పాటు మరోవైపు పోషకాలతో కూడి న ఆహారాన్ని అందిస్తున్నాం. చిన్నారులు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యంపై నిరంతరం శ్రద్ధ వహిస్తున్నాం.
-సీహెచ్.సంధ్యారాణి, డీడబ్ల్యూవో, ఖమ్మం