అశ్వారావుపేట, ఫిబ్రవరి 5: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని, రాష్ట్రస్థాయి, జాతీయ పోటీల్లోనూ రాణించాలని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ డీన్ (స్టూడెంట్ అఫైర్స్) డాక్టర్ జెల్లా సత్యనారాయణ పిలుపునిచ్చారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట పట్టణంలోని వ్యవసాయ కళాశాలలో యూనివర్సిటీ పరిధిలోని నిర్వహిస్తున్న అంతర్ కళాశాలల క్రీడా పోటీలను సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యతో పాటు క్రీడలకూ ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. శారీరక దృఢత్వం పెరుగుతుందన్నారు. క్రీడలతో మస్తిష్కాలు వికసించి మేధోవికాసానికి దోహదం చేస్తాయన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి, అదిలాబాద్ ఎస్సై జగదీష్ మాట్లాడుతూ.. క్రమశిక్షణతో చదువుకుంటే విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలను సులువుగా ఛేదించవచ్చన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జె.హేమంత్కుమార్ మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యకు భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ ఉన్నదన్నారు. తమ కళాశాల పరిధిలో పండిం చిన ప్రతి పంటకు, ప్రతి మొక్కకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామన్నారు. అత్యాధునిక సాంకేతికతను రైతులకు చేరువ చేసేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ పరిశీలకుడు జె.సురేష్, కళాశాల ప్రొఫెసర్లు, పీడీలు, ఓఐఎస్వోలు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
సోమవారం మొదలైన క్రీడలు ఈనెల 8 వరకు కొనసాగుతాయని కళాశాల యాజమాన్యం తెలిపింది. పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 11 వ్యవసాయ కళాశాలలకు చెందిన 425 మంది విద్యార్థులు అశ్వారావుపేటకు విచ్చేశారు. వీరంతా అథ్లెటిక్స్, ఖో ఖో, వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్ తదితర పోటీల్లో పాల్గొంటారు.