ఖమ్మం : ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ అండర్-10, అండర్-12, అండర్-14 విభాగంలో కల్లూరు నుంచి నలుగురు విద్యార్ధులు అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు ఖమ్మం జిల్లా అథ్లెటిక్స్ చీఫ్ కోచ్, గౌస్ తెలిపారు. కల్లూరుకు చెందిన బాలికల విభాగం నుంచి జి.మంజు, బి.లతిక, బాలుర విభాగం నుంచి డి.అనిల్కుమార్, కె.విజయరామ్ అరవింద్లు రాష్ట్రస్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని, ఈనెల 31న రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
ఎంపికైన విద్యార్థులను గ్రామపెద్దలు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షఫీ అహ్మద్, అధ్యక్షులు వెంకటేశ్వర్లు, కల్లూరు వ్యాయామ విద్య విభాగం క్రీడాశిక్షకుడు పసుపులేటి వీరరాఘవయ్య, గోపాలరావులు పాల్గొన్నారు.