కరకగూడెం, జూలై 20: ఏడాది నుంచి భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని, వెంటనే ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తూ అనంతారం జడ్పీహెచ్ఎస్ ఎదుట విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ పాఠశాల ఉపాధ్యాయుడు గత ఏడాది పాల్వంచ కేటీపీఎస్ జడ్పీహెచ్ఎస్కు డిప్యూటేషన్పై వెళ్లాడని, అప్పటి నుంచి 6-10 తరగతులకు బోధించేవారు లేక ఇబ్బందిపడుతున్నామని తెలిపారు. టెన్త్లో కీలకమైన ఫిజిక్స్ను గతేడాది నుంచి ఎవరూ బోధించకపోవడంతో రాబోయే పరీక్షలు ఎలా రాయాలో అర్థం కావడం లేదన్నారు. దీనిపై ఇన్చార్జి హెచ్ఎం వసంతరావు స్పందిస్తూ.. తమ పాఠశాలకు ఫిజిక్స్ టీచర్ను కేటాయించాలని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.