ఖమ్మం, ఏప్రిల్ 8: ఖమ్మంలోని కాల్వొడ్డు ప్రాంతం నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి. పొరుగు గ్రామాల నుంచి వచ్చి పోయేవారు, నగరంలోకి ప్రవేశించే వారితో కిట కిటలాడుతుంది. వేలాది మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారు. రోడ్డుపక్కనే పూలు, కూరగాయలు, పండ్లు అమ్మే చిరువ్యాపారులు. ఇక ట్రాఫిక్ సమస్యలైతే చెప్పనక్కర్లేదు. వందలాది వాహనాలు రయ్..రయ్ మంటూ వెళ్తాయి.. ఈ ప్రాంతంలోనే గోళ్లపాడు చానల్. ఎల్లప్పుడూ చానల్లో మురుగు ప్రవహిస్తుంది. ఇక వానకాలం వచ్చిందంటే చానల్లో వరద నీరు ఉప్పొంగి రోడ్లపై ప్రవహించేది. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం చూపించింది. గోళ్లపాడు చానెల్ ఆధునీకరించి, అండర్డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసి పైన వీధి వ్యాపారుల ప్రాంగణం నిర్మించింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కృషితో ఇప్పుటికే నగరం హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి సాధించింది. తాజాగా నగరప్రజలు, వీధి వ్యాపారుల కోసం మరో ప్రాంగణం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ప్రాంగణం ప్రారంభం కానున్నది.
రూ.కోటి వ్యయంతో..
గతంలో గోళ్లపాడు చానల్ను చూసిన వారు ఇప్పుడు ఇదే ప్రాంతంలో వీధి వ్యాపారుల ప్రాంగణం చూసి నివ్వెరపోవడం ఖాయం. ఒకప్పుడు మురుగుతో నిండిన ప్రాంతం ఇప్పుడు వ్యాపార ప్రాంగణమైంది. సుమారు ఎకరా స్థలంలో రూ.కోటి నిధులతో ప్రభుత్వం ప్రాంగణం నిర్మించింది. జూబ్లీ క్లబ్ నుంచి ప్రాంగణం ప్రారంభమై పీఎస్సార్ రోడ్డు వైపు ముగుస్తుంది. 36, 46 డివిజన్ల పరిధిలోని ఉమ్మడి స్థలంలో ప్రాంగణ నిర్మాణం పూర్తయింది.
సకల సౌకర్యాలు..
ప్రాంగణంలో 84 దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి. మరో 60 మంది ఇదే ప్రాంగణంలో కింద కూర్చొని వ్యాపారులు కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు వీలుగా స్థలాల కేటాయింపు జరిగింది. వారి కోసం నగరపాలకసంస్థ మంచినీటి వసతి కల్పిస్తున్నది. టాయిలెట్స్ నిర్మించింది. నగరవాసుల కోసం పార్కింగ్కు చోటు ఇచ్చింది. ప్రాంగణంలోకి వాహనాలు రాకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నది.
వీధి వ్యాపారులకు ప్రయోజనకరం
ప్రజల ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం కాల్వొడ్డులో వీధి వ్యాపారుల ప్రాంగణం నిర్మించింది. వీధి వ్యాపారులు ఒక్క దగ్గర కూర్చొని కూరగాయలు, పండ్లు విక్రయించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రాంగణం నిర్మించి నగరవాసులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– రామ్మోహన్రావు, 36వ డివిజన్ కార్పొరేటర్
ట్రాఫిక్ సమస్యలకు చెక్..
వీధి వ్యాపారుల ప్రాంగణం ఏర్పాటుతో ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తప్పుతాయి. చిరు వ్యాపారులూ వ్యాపారం చేసుకునేందుకు అనువైన ప్రదేశం దొరుకుతుంది. ప్రాంగణంలో నగరవాసులకు అన్నిరకాల కూరగాయలు, పండ్లు ఒకే చోట లభ్యమవుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రాంగణం తెరిచే ఉంటుంది.
– కన్నం వైష్ణవి, 46వ డివిజన్ కార్పొరేటర్