రఘునాథపాలెం, ఫిబ్రవరి 20 : ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలంగా ఉన్న రఘునాథపాలేన్ని రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని బావోజీతండా, మల్లేపల్లి, రాములుతండా, పరికలబోడుతండా, జింకలతండా గ్రామాల్లో రూ.1.13 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో రఘునాథపాలెం మండలం పూర్తి అభివృద్ధిని సాధించిందన్నారు. తాను మంత్రిగా మండలాభివృద్ధికి రూ.287 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఎక్కడా మట్టిరోడ్డు లేకుండా సీసీల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఈ ఏడాది ఈజీఎస్ పథకానికి సీడీపీ నిధులు రూ.10 కోట్లు అదనంగా కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ నిధులతో మార్చి నెలాఖరుకల్లా పనులు చేసుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. రఘునాథపాలెం మండల కేంద్రంగా విద్యాలయాలు, కళాశాలలను తీసుకరానున్నట్లు చెప్పారు.
మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో భవన నిర్మాణాల కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఒక్కో పంచాయతీ భవనానికి రూ.25 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. తండాల్లో నూతన జీపీలను నిర్మించుకొని సొంత భవనాల్లో పరిపాలన సాగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా గౌరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆజ్మీరా వీరూనాయక్, మహిళా అధ్యక్షురాలు బానోతు ప్రమీల, మండల నాయకుడు మందడపు నర్సింహారావు, ఏఎంసీ వైస్ చైర్మన్ అఫ్జల్మియా, ఆత్మ చైర్మన్ లక్ష్మణ్నాయక్, నాయకులు తాతా వెంకటేశ్వర్లు, బానోతు వెంకటేశ్, సర్పంచులు పాండు, మోతీలాల్, విజయ, బండి వెంకన్న నాయకులు ఉప సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పేదింట్లో పుట్టిన ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో పెళ్లి సమయంలో ఆర్థిక భరోసా కల్పించాలని సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు శ్రీకారం చుట్టారని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం రఘునాథపాలెం రైతువేదికలో మండలంలోని 70మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికీ చేరుతున్నాయనడానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. పేదల సంక్షేమమే ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదన్నారు. ఇప్పటివరకు రఘునాథపాలెం మండలంలో రూ.75 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను అందించినట్లు తెలిపారు. సీఎంఆర్ఎఫ్ కింద నిరుపేదల ఆరోగ్య ఖర్చులకు రూ.92 కోట్లు సాయం చేసినట్లు పేర్కొన్నారు.