భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రతీ పది గ్రామాలను ఒక యూనిట్గా తీసుకుని ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ టీ.భానుప్రసాద్ సూచించారు. వాటి నిర్వహణ బాధ్యతను ఆయా నియోజకవర్గాల పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులే తీసుకోవాలని సూచించారు. బీఆర్ఎస్లో కీలకంగా పనిచేసే కార్యకర్తలకు అండగా ఉండేందుకు ప్రజాప్రతినిధులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
కొత్తగూడెం బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. త్వరలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలను పక్కా ప్రణాళికతో నిర్వహించాలన్నారు. పనిచేసే వారికి ప్రాధాన్యమివ్వాలన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిర్వహించే ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. క్షేత్రస్థాయి లో కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రభుత్వ పథకాలు ఇంటింటికీ చేరేలా ప్రచారం చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశమంతా చూస్తోందని, దీనిని కాంగ్రెస్, బీజేపీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు.