భద్రాద్రి కొత్తగూడెం, మే 29 (నమస్తే తెలంగాణ): జూన్ 2 నుంచి 21 వరకు జిల్లాలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రగతి ప్రతిబింబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ అనుదీప్ అధ్యక్షతన జరిగిన అధికారులు, ప్రజాప్రతినిధులతో స్థానిక ఐడీవోసీలో సోమవారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిల్లో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ప్రతీ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు హాజరుకావాలని, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేళ్లలో జరిగిన ప్రగతిని ప్రజలకు తెలియజేయాలన్నారు. 2014కు ముందు మన పల్లెలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందాయి?అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఇంటింటికీ అందుతున్న పథకాల గురించి పల్లెల్లో చర్చించాలన్నారు. భద్రాద్రికి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, కొత్త కలెక్టరేట్, రామవరంలో మాతాశిశు వంటి కొత్త సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నారు.
కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావారణంలో జరుపుతామన్నారు. 21 రోజులు నిర్వహించే కార్యక్రమాల గురించి ఇప్పటికే సీఎస్ వీసీలో వివరించారన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్నీ ప్రజలకు చేరిన వైనాన్ని తెలియజెప్పాలన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా చాలా మార్పులు వచ్చాయన్నారు. అందుకే భద్రాద్రి పచ్చదనంతో కళ కళలాడుతుందన్నారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియానాయక్ మాట్లాడుతూ నాటికీ, నేటికీ చాలా తేడా ఉందని, అదే తెలంగాణ ప్రగతి అని అన్నారు.
గ్రామస్థాయిలో కూడా సమీక్షలు నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేస్తామన్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీవో గౌతమ్, అదనపు ఎస్సీ సాయిమనోహర్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.