ప్రజా సంక్షేమం కోసం అనునిత్యం పాటుపడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాదుకుంటారో.. వదులుకుంటారో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పనిచేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. తల్లాడ మండలం రామానుజవరంలో శుక్రవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రమూ చేయని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సీఎం కేసీఆర్ హయాంలో జరిగాయని పేర్కొన్నారు. ఎవరెన్ని అవాకులు, చెవాకులు పేలినా.. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు చైతన్యవంతులని వారిని పక్కదోవ పట్టించడం ఎవరితరం కాదన్నారు. కరోనా సమయంలో కాకరకాయ కూడా పంపిణీ చేయని రాజకీయ నాయకులు.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ వస్తున్నారని మండిపడ్డారు. ఆపద సమయంలో ఆదుకోవడానికి మనస్సు రాని నేతలను ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.
ఖమ్మం, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ తల్లాడ : ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రామనుజవరంలో శుక్రవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. స్వార్థపూరిత రాజకీయాలు చేసే వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యకర్తలు వారి మాటలను నమ్మొద్దన్నారు. వారి రాజకీయాలు ఎండగట్టి ప్రజలకు వివరించాలన్నారు. సమన్వయంతో పనిచేసి సీఎం కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాలన్నారు. సత్తుపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్కు కంచుకోట అన్నారు. ఎమ్మెల్యే సండ్ర నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారన్నారు. ఆయన నిబద్ధత మిగతా ఎమ్మెల్యేలకూ ఆదర్శప్రాయమన్నారు. సండ్రను వచ్చే ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2009లో కాంగ్రెస్ స్వరాష్ర్టాన్ని ఇచ్చినట్లే ఇచ్చి తర్వాత వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమ నేతగా కేసీఆర్ ఉవ్వెత్తున ఉద్యమం నిర్వహించారన్నారు. తిరిగి తెలంగాణను సాధించారన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. ప్రజలు ప్రజాసంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాదుకోవాలని, విజయం కట్టబెట్టాలన్నారు. ఇతర పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధిని చంపుకున్నట్లేనన్నారు. తెలంగాణ ధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ అని, దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం ఎదిగిందన్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆత్మ గౌరవ ప్రతీకగా దేశానికి చాటి చెప్పారన్నారు. కేంద్రంలోని బీజేపీ మాత్రం రాష్ట్రం నుంచి రూ.వేల కోట్ల ఆదాయాన్ని తీసుకెళ్తున్నదని కానీ, తిరిగి పైసా అయినా విదిల్చడం లేదని మండిపడ్డారు. రాష్ర్టానికి రావాల్సిన వాటాలో కోత విధిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, బీఆర్ఎస్ తల్లాడ, పెనుబల్లి మండలాల అధ్యక్షులు రెడ్డెం వీరమోహన్రెడ్డి, కనగాల వెంకట్రావు, ఎంపీపీలు దొడ్డా శ్రీనివాసరావు, లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీలు దిరిశాల ప్రమీల, చెక్కిలాల మోహన్రావు, ఆత్మ కమిటీ చైర్మన్ వాసు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ దుగ్గిదేవర వెంకట్లాల్, ఏఎంసీ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, సర్పంచ్ శీలం కోటారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు శీలం శివపార్వతి, సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు దాసురావు, కోటిరెడ్డి, రామకృష్ణ, వీరభద్రరావు, రామారావు, లక్ష్మి, వనిగండ్ల అలేఖ్య, శ్రీనివాసరావు, కళావతి పాల్గొన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తున్నాం. ఏడాదిన్నరలో రూ.150 కోట్లతో తల్లాడ మండలంలో రోడ్లు నిర్మించాం. మౌలిక సదుపాయాలు కల్పించాం. కమ్యూనిటీ హాల్స్ నిర్మించాం. కుర్నవల్లి- ఉమ్మడ దేవరపల్లి, కుర్నవల్లి- పుణ్యపురం రోడ్డు నిర్మించాం. బ్రిడ్జి నిర్మించాం. నియోజకవర్గ వ్యాప్తంగా 80 శాతం అంతర్గత రోడ్లు పూర్తి చేశాం. 4,360 మందికి రూ.21 కోట్ల సీఎంఆర్ఎఫ్ సాయం అందించామన్నారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందింది. ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలి. – సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
మాజీ ఎంపీ పొంగులేటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయనని అనుచితంగా మాట్లాడుతున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీలోకి వెళ్తారు. ఆపడానికి పొంగులేటికి ఎవరు.? అర్థం పర్థం లేకుండా నోటికి వచ్చిందల్లా మాట్లాడితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. ఎమ్మెల్యే సండ్ర సారథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటపట్టింది. కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి మరోసారి సండ్రను ఎమ్మెల్యేగా గెలిపించాలి.
– డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం
రాబోయే ఎన్నికల్లో ప్రజలు సండ్ర వెంకటవీరయ్యను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలి. నైతిక బాధ్యతతో పనిచేయాలి. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్యకర్తలు సమష్టిగా పనిచేసి సత్తుపల్లిలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలి. కొందరు డబ్బు ఉందన్న అహంతో రాజకీయాలు చేస్తున్నారు. అలాంటి వారిని నమ్మొద్దు. ఎమ్మెల్యే సండ్రను విమర్శించే స్థాయి స్వార్థ రాజకీయాలు చేసే వారికి లేదు.
– డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు