భధ్రాద్రి కొత్తగూడెం, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : భద్రాచలంలో శ్రీరామనవమి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, నవమి వేడుకలు, మహా పట్టాభిషేకం మహోత్సవాలను వీక్షించే భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని కలెక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ సమావేశ మందిరంలో శ్రీరామనవమి, మహా పట్టాభిషేక కార్యక్రమాలపై అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. కల్యాణ మండపం ప్రాంతాన్ని 26 సెక్టార్లుగా విభజించి, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. భక్తుల వసతి(లాడ్జి)ని ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామని, టికెట్ల విక్రయాలు కూడా ఆన్లైన్లో చేపట్టాలని, విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. సెక్టార్లలో ప్రత్యేక పారిశుధ్య సిబ్బందిని నియమించాలని డీపీవోకు సూచించారు. పట్టణంలో పారిశుధ్య పర్యవేక్షణకు 25 జోన్లుగా విభజించి.. ప్రతి జోన్కు ఒక ఎంపీవో, నలుగురు కార్యదర్శులను నియమించినట్లు పేర్కొన్నారు. మంచినీటి సరఫరాకు 200 మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, దేవస్థానం ఈవో రమాదేవి, డీఆర్వో రవీంద్రనాథ్, ఆర్డీవో మధు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.