భద్రాచలం, మార్చి 4: దక్షిణ అయోధ్యపురి భద్రాద్రిలో కొలువైన రామయ్య కల్యాణ మహోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆలయ వైదిక కమిటీ ఈ మేరకు సోమవారం ఆలయ ఈవో రమాదేవికి నివేదిక అందించింది. ఏప్రిల్ 17న పట్టణంలోని మిథిలా ప్రాంగణంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు అంగ రంగ వైభవంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. తదుపరి రోజు రామయ్యకు మహాపట్టాభిషేకం చేయనున్నారు.
శ్రీరామనవమి సందర్భంగా ఇదే నెల 9 నుంచి ఆలయ సన్నిధిలో 23వ తేదీ వరకు వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి నవాహ్ని తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. తొలిరోజు అర్చకులు ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. రుత్విక్ వరణం, రక్షా బంధనం, స్నపన తిరుమంజనం, పుట్టమన్నుతో పూజ, కల్పవృక్ష వాహనంపై రామయ్యకు తిరువీధి సేవ, పంచాంగ శ్రవణం చేయనున్నారు. 13న మండల లేఖనం, కుండ, కలశ, అలంకరణాదులు, సార్వ భౌమ సేవ, 14న గరుడ ధ్వజ పట లేఖనం, పటావిష్కరణ, గరుడ ధ్వజాధివాసం, 15న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీ తాడనం, దేవతాహ్వానం, బలి సమర్పణ,
హనుమంత వాహన సేవ, 16న గరుడ వాహన సేవ, ఎదుర్కోలు సేవ, 19న సదస్యం, స్వామివారికి హంస వాహన సేవ, 20న తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వవాహన సేవ, 21న స్వామివారికి ఊంజల్ సేవ, సింహ వాహన సేవ. 22న వసంతోత్సవం, హవనం, గజవాహన సేవ, 23న చక్రతీర్థం, పూర్ణాహుతి, శేష వాహన సేవ, ధ్వజారోహణం, ద్వాదశ ప్రదక్షిణ చేయనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు స్వామివారి నిత్యకల్యాణం, దర్బార్ సేవలు, ఏప్రిల్ 9 నుంచి మే 1వరకు పవళింపు సేవలు నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.