ఖమ్మం, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):కల్యాణ వైభోగం.. ఆనంద రాగాల శుభయోగం.. రఘువంశ రామయ్య.. సుగుణాల సీతమ్మ.. వరమాలకై వేచు సమయాన.. చెలి మనసు గెలిచాకే శివ ధనసు విరిచాకే వధువు మది గెలిచాకే మోగింది కల్యాణ శుభ వీణ.. వరుడు రామయ్యగా వధువు సీతమ్మగా కనువిందు చేయగ.. కనులు తరించేను.. మనసులు పులకించేను.. ఆ శుభ ఘడియలకు భద్రాద్రి ముస్తాబైంది.. అర్చకులు, ఆలయ అధికారులు గురువారం ఆలయ ప్రాంగణంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నారు. గురువారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుముహూర్తాన కల్యాణ మహోత్సవం జరుగనున్నది.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.
శ్రీరామనవమి ఉత్సవాలకు భద్రాద్రి ముస్తాబైంది. వేడుకలను వీక్షించేందుకు వచ్చిన భక్తులతో భక్తజన తరలివచ్చింది. గోటి తలంబ్రాలు తెస్తూ కొందరు భక్తులు.. ముత్యాలు తెస్తూ కొందరు దాతలు.. ఇలా ఎవరికివారు తమకు తోచిన విధంగా కల్యాణ మహోత్సవంలో భాగస్వాములు అవుతున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు గురువారం ఆలయ ప్రాంగణంలోని మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ఇప్పటికే షామియానాలు, చలువు పందిళ్లు సిద్ధమయ్యాయి. ఉదయం 9.30 గంటలకు కల్యాణ మూర్తులను వేదమంత్రోచ్ఛారణ నడుమ మిథిలాస్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకురానున్నారు. 10.30 నుంచి కల్యాణతంతు ప్రారంభిస్తారు. సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం అభిజిత్ లగ్న సుమూహూర్తాన కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. వేడుకలను వీక్షించేందుకు తెలుగు రాష్ర్టాల నుంచే కాక పొరుగు రాష్ర్టాల నుంచి భక్తులు తరలివచ్చారు. అర్చకులు శ్రీరామచంద్రుడు, సీతమ్మను వాగ్గేయకారుడు భక్తరామదాసు, తానీషా చేయించిన ఆభరణాలను అలంకరించనున్నారు. పెండ్లికొడుకుగా రాముడిని, సీతమ్మతల్లిని పెండ్లికూతురుగా ముస్తాబు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు.
ఎక్కడ చూసినా భక్తుల సందడే…
వేడుకల వీక్షించేందుకు వచ్చిన భక్తులతో బుధవారం రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట, ఆర్టీసీ బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్ కిటకిటలాడుతూ కనపించాయి. గురువారం నాటికి రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు భద్రాచలానికి రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ఆలయ అధికారులు పట్టణంలోని పలు చోట్ల ప్రసాద కౌంటర్లు, కల్యాణ తలంబ్రాల కౌంటర్లు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రామాలయ పరిసర ప్రాంతాల్లో వసతి కేంద్రాలు ఏర్పాటు చేశారు. గోదావరి స్నాన ఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ ప్రాంతాల్లో షామియానాలు, రామాలయ మాడవీధులు, గోదావరి ఘాట్లలో చలువ పందిళ్లు వేయించారు.
నేడు పుష్కర మహాపట్టాభిషేకం..
శ్రీసీతారామ కల్యాణమహోత్సవం జరిగిన మర్నాడు రామయ్యకు మహాపట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. దీనిలో భాగంగా శుక్రవారం పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే పుష్కర మహాపట్టాభిషేకం జరుగనున్నది. సీతారామ కల్యాణ మహోత్సవానికి సీఎం కేసీఆర్ రూ.కోటి ప్రత్యేక నిధులు కేటాయించారు. నిధులతో ఆలయ అధికారులు ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు.
పకడ్బందీగా బందోబస్తు..
సీతారామ కల్యాణ మహోత్సవం, పుష్కర మహాపట్టాభిషేక వేడుకలకు పోలీస్శాఖ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఎస్పీ డాక్టర్ వినీత్ ఆధ్వర్యంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు రంగంలోకి దిగి 6వేల మంది సిబ్బందితో కలిసి శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు. మిథిలా స్టేడియంలో సెక్టార్ల వారీగా బందోబస్తు నిర్వహించనున్నారు. భక్తుల సమస్యలను పరిష్కరించేందుకు సెక్టార్ల వారీగా తహసీల్దార్లు నియమితులయ్యారు. ట్రాఫిక్ సమస్యల నివారణకు రూట్ మ్యాప్లు ఏర్పాటు చేశారు.
కల్యాణ మహోత్సవానికి ముస్తాబైన పర్ణశాల
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి అనుబంధమైన దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల రామాలయం శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబైంది. గురువారం అర్చకులు ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం షామియానాలు, విశ్రాంతి గదులు, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో తలంబ్రాల కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. వైద్యారోగ్య ఆధ్వర్యంలో వైద్యులు, సిబ్బంది ఆలయ పరిసరాల్లో వైద్యశిబిరాలు నిర్వహించనున్నారు. ఏర్పాట్లను దుమ్ముగూడెం తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో చంద్రమౌళి, ఎంపీవో ముత్యాలరావు, నీటిపారుదల శాఖ అధికారి డీఈ నాగేశ్వరరావు, ఏఈ రాజు సుహాస్, మిషన్ భగీరథ అధికారి రాము, ఆర్ఐలు ఆదినారాయణ, లక్ష్మయ్య పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం పర్ణశాల ఆలయ సన్నిధిలో జరుగనున్న రామయ్య పుష్కర మహాపట్టాభిషేకాన్ని వీక్షించేందుకు గవర్నర్ తమిళిసై వస్తుండడంతో పోలీస్శాఖ పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నది. సీఐ రమేశ్ సిబ్బందితో కలిసి శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు.
రామయ్య సన్నిధిలో ఎదుర్కోలు ఉత్సవం
భద్రాచలం సీతారామచంద్రస్వామి వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. అర్చకులు సీతారాముల ఉత్సవమూర్తులను భక్తరామదాసు తయారు చేయించిన దివ్యాభరణాలతో అలంకరించి వైకుంఠ ద్వార దర్శనం ప్రాంగణం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై సీతారాములను అభిముఖంగా ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. రామయ్య తరపున ఒక అర్చకస్వామి, సీతమ్మ తరఫు మరో అర్చకస్వామి ప్రతినిధులుగా వ్యవహరించి ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. వేడుకలో రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్, దేవస్థాన ఈవో ఎల్.రమాదేవి, ఏఈవో శ్రావణ్కుమార్, ఆస్థాన స్థానాచార్యుడు కేఈ స్థలశాయి, ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన్ పాల్గొన్నారు.
యంత్రాంగం ఉదయం 5 గంటల కల్లా విధుల్లో ఉండాలి
కల్యాణ మహోత్సవ విధులకు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదయం 5 గంటల కల్లా విధుల్లో ఉండాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. భదాచలం పట్టణంలోని సబ్కలెక్టర్ కార్యాలయం నుంచి బుధవారం వేడుకలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా శ్రీరామనవమి, పుష్కర సామ్రాజ్య మహా పట్టాభిషేకాన్ని నిర్వహించాలన్నారు. మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్శాఖ అధికారులు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. సెక్టార్ అధికారులకు వాకీటాకీల సాయంతో కంట్రోల్ రూంకు సమాచారం అందజేయాలన్నారు. అన్ని సెక్టార్లలో భక్తుల కోసం తాగునీటి వసతి కల్పించాలన్నారు.