విద్యార్థుల బంగారు భవిష్యత్కు క్రీడా పాఠశాల దోహదం చేస్తున్నది. పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నది. క్రీడా పాఠశాలల్లో చదివిన ఎంతో మంది విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చూపి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉత్తమ క్రీడాకారులుగా, కోచ్లుగా ప్రస్తుతం పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని కిన్నెరసాని గురుకుల పాఠశాలను 2019 నుంచి క్రీడా పాఠశాలగా మార్చారు. అందులో ఐదో తరగతిలో ప్రవేశం పొందేందుకు దశల వారీగా పలు రకాల పరీక్షలు నిర్వహించి వారి క్రీడాసామర్థ్యాన్ని పరీక్షించి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. కిన్నెరసాని క్రీడా పాఠశాలలో బాలురు 40 మందికి, గుండాల మండలంలోని కాచనపల్లి క్రీడా పాఠశాలలో బాలికలు 40 మందికి ప్రవేశం కల్పిస్తున్నారు.
పాల్వంచ రూరల్, ఫిబ్రవరి 27 : క్రీడా పాఠశాలలో ప్రవేశం లభిస్తే విద్యార్థుల భవిష్యత్కు బంగారు బాట పడినట్లే. విద్య పునాదులు బలంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నది. విద్యార్థులకు సకల సౌకర్యాలు కల్పించి వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు క్రీడా పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఈ క్రీడా పాఠశాలల్లో చదివిన చాలామంది విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చూపి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉత్తమ క్రీడాకారులుగా, కోచ్లుగా ప్రస్తుతం పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని గురుకుల పాఠశాలను 2019 నుంచి క్రీడా పాఠశాలగా మార్చారు. అందులో ఐదో తరగతిలో ప్రవేశం పొందేందుకు దఫాల వారీగా పలురకాల పరీక్షలు నిర్వహించి వారి క్రీడా సామర్థ్యాన్ని పరీక్షించి విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. కిన్నెరసాని క్రీడా పాఠశాలలో బాలురు 40మందికి, గుండాల మండలంలోని కాచనపల్లి క్రీడా పాఠశాలలో బాలికలు 40మందికి ప్రవేశం కల్పిస్తున్నారు.
ఐదో తరగతిలో పరీక్ష పొందేందుకు 9-11 సంవత్సరాల మధ్య గల విద్యార్థులకు బ్యాటరీ టెస్ట్(శరీర సామర్థ్య పరీక్ష) నిర్వహిస్తారు. టెస్ట్కు ముందు క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులను ఆయా పాఠశాలల నుంచి ఎంపిక చేసి పాఠశాల, మండల స్థాయిలో పోటీలు నిర్వహించి సామర్థ్యాలను పరీక్షిస్తారు. పరీక్షలో నెగ్గిన వారిని జిల్లాస్థాయి పోటీలకు పంపిస్తారు. అక్కడ ప్రతిభ చూపిన వారిని క్రీడా పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం పొందేందుకు ఎంపిక చేస్తారు. మొత్తం 9అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఎత్తు, బరువు, శారీరదారుఢ్యం, రన్నింగ్(మూడు రకాలు), మెడిసిన్ త్రో, బ్రాడ్ జంపింగ్, వర్టికల్ జంపింగ్, లాంగ్ రన్ తదితర పోటీలు ఉంటాయి. తక్కువ సమయంలో లక్ష్యాన్ని సాధించిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. ప్రతిభ చూపిన వారికి ఐటీడీఏ పరిధి(భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా)లోని విద్యార్థులకు మళ్లీ క్రీడా పోటీలు నిర్వహించి అర్హులైన వారికి ప్రవేశం కల్పిస్తారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 400 మంది విద్యార్థులు ప్రతి ఏడాది క్రీడా పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశం పొందేందుకు తీవ్రంగా పోటీ పడతారు.
ఐదో తరగతిలో ప్రవేశం పొందితే చాలు, పదో తరగతి వరకు విద్యార్థుల భవిష్యత్కు ఢోకా ఉండదు. అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, ప్రతిరోజు నాన్వెజ్, సాయంత్రం అల్పాహారం అందిస్తారు. ఈ అల్పాహారంలో శనగలు, గుగ్గిళ్లు, పల్లిపట్టి, సీజనల్ వారీగా దొరికే పండ్లు అందిస్తారు. ఉదయం 5గంటల నుంచి 8గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తారు. 5, 6 తరగతుల విద్యార్థులకు అథ్లెటిక్స్, ఆర్చరీ, కబడ్డీ, వాలీబాల్లో శిక్షణనిచ్చి వారి ప్రతిభను గుర్తిస్తారు. వారి ప్రతిభ చూపిన క్రీడలో ఏడో తరగతిలో ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. ఒక్కొక్క క్రీడకు ప్రత్యేక కోచ్ ఉంటారు. ప్రత్యేకంగా డిసిప్లిన్ కోచ్ కూడా ఉండి ఆటలు ఆడే సమయంలో విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంది, ఎటువంటి ప్రదర్శన చూపిస్తున్నాడు, గెలుపోటముల సమయంలో మానసిక స్థితి ఎలా ఉంది తదితర విషయాలను తీక్షణంగా పరిశీలించి, తర్వాత వారు తమ ప్రవర్తన మెరుగుపర్చుకునేందుకు తగిన సూచనలు, సలహాలిస్తారు. వారి శిక్షణలో విద్యార్థులు తమకిష్టమైన క్రీడలో రాణించేందుకు తర్ఫీదునిస్తారు. అంతేకాక సంవత్సరానికి రెండు జతల షూస్, మరో రెండు జతల ట్రాక్షూ, టీషర్ట్స్, షాట్స్ అంద్తిరు.
క్రీడా పాఠశాలలో వివిధ రకాల క్రీడలను ప్రాక్టీస్ చేసేందుకు రకరకాల గ్రౌండ్స్ ఉన్నాయి. గ్రౌండ్ల అభివృద్ధి, మరమ్మతుల కోసం ఐటడీఏ రూ.46 లక్షలు మంజూరు చేయడంతో వీటిని ఉన్నత ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. వీటితో ప్రత్యేకంగా ఆర్చరీ గ్రౌండ్, 400మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, రెండు కబడ్డీ కోర్టులు, రెండు వాలీబాల్ కోర్టులు, బీచ్ వాలీబాల్ కోర్టు, కాన్ఫరెన్స్ హాలు ఉన్నాయి.
కిన్నెరసాని క్రీడా పాఠశాలలో ఐదో తరగతిలో ప్రవేశానికి ఎంపిక కోసం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. సోమవారం రెండోరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 200మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరికి బ్యాటరీ టెస్ట్లు నిర్వహించారు. మార్చి 18వ తేదీన నిర్వహించే తుది క్రీడల్లో వారి సామర్థాన్ని పరీక్షించి మొత్తం 50మందిని ఎంపిక చేస్తారు. వీరిలో 40మంది కిన్నెరసాని బాలుర క్రీడా పాఠశాల, 40మంది కాచనపల్లి బాలికల క్రీడా పాఠశాల, 10మందిని హైదరాబాద్ బోయినపల్లిలోని వాటర్ స్పోర్ట్ అకాడమీకి ఎంపిక చేస్తారు. భద్రాచలం ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ వీరూనాయక్, క్రీడాపాఠశాల హెచ్ఎం చందు, క్రీడా ఉపాధ్యాయులు సుబ్రమణ్యం, ఏ.వెంకటేశ్వరు, నగేష్, మోతీలాల్, బి. వెంకటేశ్వర్లు, హరికృష్ణ, క్రిష్టవేణి, రాంబాబు, వీరన్న, ప్రసన్న తదితరులు క్రీడలను నిర్వహించారు.
స్థానిక గురుకులాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులు ఆయా పాఠశాలల్లో జరిగే పోటీల్లో ప్రతిభ చూపిస్తే.. వారిని ఉపాధ్యాయులు గుర్తిస్తారు. ఐదో తరగతిలో ప్రవేశం కోసం కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో జరిగే పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ పోటీలు ఆషామాషీగా ఉండవు. నిర్ణీత సమయం కంటే ముందుగా గమ్యం చేరడం, చురుకుదనం, శరీర ధృడత్వం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేస్తారు. వీరికి మార్చి 18న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారికి ఫైనల్గా మరోసారి పోటీలు నిర్వహించి ఐదో తరగతిలో 40 మంది బాలురు, 40 మంది బాలికలను ఎంపిక చేస్తారు. మరో 10మందిని వాటర్ స్పోర్ట్స్ అకాడమీకి పంపిస్తారు.
ఐటీడీఏ పీవో గౌతమ్ కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్పై ప్రత్యేక శ్రద్ధతో క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. గత ఏడాది ఇంటర్ ప్రీమియర్ లీగ్ రాష్ట్రవ్యాప్త క్రీడలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ తర్వాత కిన్నెరసానిలో అన్నిరకాల క్రీడా పోటీలు నిర్వహించడం గొప్ప విషయం. డీడీ రమాదేవి కూడా క్రీడా పాఠశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. క్రీడల నిర్వహణకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. రానున్న కాలంలో మరిన్ని క్రీడా పోటీలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ వేదిక కానుంది.
– డాక్టర్ వీరూనాయక్, స్పోర్ట్స్ ఆఫీసర్, ఐటీడీఏ