ఖమ్మం సిటీ, జనవరి 4: ప్లడ్ లైట్స్ వెలుగులు, ఛీర్ గర్ల్స్ డ్యాన్స్లు, పటాకుల మోతలు, వేలాదిగా తరలివచ్చిన అభిమానుల కేరింతలు.. వెరసి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం హోరెత్తింది. వారం రోజలుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగుతున్న పువ్వాడ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్)- 3, టీ -20 డే అండ్ నైట్ క్రికెట్ పోటీల సందర్భంగా బుధవారం జరిగిన ఫైనల్స్ అంతర్జాతీయ మ్యాచ్ను తలపించింది. పువ్వాడ ఉదయ్కుమార్ జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ పోటీల్లో ఫైనల్ మ్యాచ్లో భద్రాచలానికి చెందిన ప్రకాశ్ ప్రాజెక్ట్స్, ఖమ్మం ఇండస్ హాస్పిటల్ పెవిలియన్ డెడ్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ప్రకాశ్ ప్రాజెక్ట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది.
అనంతరం 124 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగన ఇండస్ హాస్పిటల్ టీం 19.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు సాధించి పీపీఎల్ విజేతగా నిలిచింది. ఇరు జట్ల మధ్యన ఫైనల్ పోరు హోరాహోరీగా సాగింది. ప్రత్యర్థి విసిరిన లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఇండస్ ఆటగాళ్లు 17వ ఓవర్ వరకు విజయం దిశగానే సాగారు. కానీ 19వ ఓవర్లో ప్రకాశ్ ప్రాజెక్ట్స్ జట్టు బౌలర్ నీరజ్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆఖరి ఓవర్లో వికెట్ నష్టానికి తొమ్మిది పరుగులు చేయాల్సి వచ్చింది.
ప్రకాశ్ ప్రాజెక్ట్స్ జట్టు విజయం ఖాయమని అందరూ భావిస్తుండగా చివరి ఓవర్ రెండో బంతికి రెండు పరుగులతోపాటు ఓవర్ త్రో కారణంగా మరో నాలుగు కలిపి మొత్తం ఆరు పరుగులు వచ్చాయి. దీంతో ఇండస్ ఆసుపత్రి గెలుపు ఖాయమైంది. మూడు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని పీపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ప్రథమ బహుమతి గెలుపొందిన ఇండస్ జట్టుకు ప్రసూన, సురక్ష ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ బాలభాస్కర్రెడ్డి రూ.2.50 లక్షలు, రన్నర్స్గా నిలిచిన ప్రకాశ్ ప్రాజెక్ట్స్ జట్టుకు రివాన్స్ ఇన్ఫోటెక్ సంస్థ రూ.1.50 లక్షల పారితోషికాన్ని ప్రకటించారు. పీపీఎల్ విజేతలకు ముఖ్య అతిథి మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ట్రోపీలను అందించారు.
యువత కోసం మరిన్ని ట్రోపీలు: మంత్రి అజయ్
జిల్లాలోని మరుగున పడిన యువతలో ప్రతిభను వెలికి తీసేందుకు పీపీఎల్ లాంటి క్రికెట్ టోర్నీలను మరెన్నింటినో నిర్వహిస్తామని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. పటేల్ స్టేడియంలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా తన సీడీపీ నిధుల నుంచి రూ.18 లక్షలు వెచ్చింది ప్లడ్లైట్స్ను ఏర్పాటు చేశామన్నారు. పీపీఎల్తోపాటు మరిన్ని టోర్నీలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
స్టేడియంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టెన్నిస్, వాలీబాల్, హ్యాండ్బాల్, స్కేటింగ్ వంటి అనేక క్రీడలకు ప్రత్యేక మైదానాలను రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, మేయర్ నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీవైఎస్వో పరంధామరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, సీపీఐ నాయకులు బాగం హేమంతరావు, పోటు ప్రసాద్, సీపీఎం నాయకుడు నున్నా నాగేశ్వరరావు, కార్పొరేటర్లు పగడాల శ్రీవిద్య, రాపర్తి శరత్, ఏసీపీ ఆంజనేయులు, స్పర్శ అధ్యయన వేదిక వ్యవస్థాపకుడు కాకి భాస్కర్, శ్రీబాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి, టోర్నీ నిర్వాహకులు మసూద్, బాలబోయిన సందీప్, ఫారూఖ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా ‘అన్ స్టాపబుల్’ టీం..
పీపీఎల్ ఫైనల్స్, ముగింపు వేడుకలకు ‘అన్ స్టాపబుల్’ బృందం విచ్చేసింది. ఖమ్మానికి చెందిన హీరో సన్ని, హీరోయిన్ అక్షితఖాన్, ఇతర నటులు హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సన్ని మాట్లాడుతూ.. ‘ఎట్లున్నరు మచ్చా..’ అనగానే యువతీయువకులు కేరింతలతో హోరెత్తించారు. బహుమతుల ప్రదానోత్సవం సందర్భంగా నటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఖమ్మం ప్రజలకు హాస్యాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచారు.