పాడి రైతును ఆర్థికంగా బలోపేతం చేసేలా రాష్ట్ర సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. పాల ఉత్పత్తుల పెంపునకు అనుగుణంగా పశు సంపదను రెట్టింపు చేసేలా ప్రభుత్వాలు యేటా జాతీయ కృత్రిమ గర్భధారణ (కృషి కల్యాణ్ అభియాన్) కార్యక్రమం నిర్వహిస్తున్నది. మేలుజాతి పశు సంపద అభివృద్ధికి కృత్రిమ గర్భధారణ పద్ధతిని ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి. భద్రాద్రి జిల్లాలో నాల్గో విడత నిర్విరామంగా సాగుతున్నది. గత మూడు విడతల్లో 68,292 పశువులకు కృత్రిమ గర్భధారణ కోసం ఇంజక్షన్లు చేయగా రెండు విడతల్లో 6,822 దూడలు ఉత్పత్తి చెందాయి. సహజ గర్భధారణతో పోల్చితే కృత్రిమ గర్భధారణతో ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని పశు, సంవర్ధకశాఖ అధికారులు పేర్కొంటున్నారు.
– అశ్వారావుపేట, ఫిబ్రవరి 13
అశ్వారావుపేట, ఫిబ్రవరి 13 : పాడి రైతు ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పశు సంపద పెంపునకు ‘కృషి కళ్యాణ్ అభియాన్’ (జాతీయ కృత్రిమ గర్భధారణ) కార్యక్రమం అమలు చేస్తున్నది. 2019-2020లో మొదటి విడతగా ప్రారంభించిన కార్యక్రమాన్ని భద్రాద్రి జిల్లా పశు సంవర్ధకశాఖ 6 నెలలకు ఒకసారి చేపడుతున్నది. నాల్గో విడత కార్యక్రమంలో గతేడాది అక్టోబర్లో ప్రారంభం కాగా.. ఈ ఏడాది మార్చి నెల వరకు కొనసాగుతున్నది. దీరి ద్వారా ఎదకు రాని పశువులను అధికారులు గుర్తిస్తారు. వీర్యనాళిక ద్వారా పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తారు. పాడి రైతుకు రెట్టింపు ఆదాయం అందించడమే కాకుండా పశు సంపదను పెంచేందుకు ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఎదకు రాని పశువులను అధికారులు గుర్తించి రైతుల ఇంటికే వెళ్లి ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేసి ఎదకు వచ్చేలా చేయడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం.
కృత్రిమ గర్భధారణ ఇలా
పశుసంపద పెంపు కోసం ప్రభుత్వాలు చేపడుతున్న కృత్రిమ గర్భధారణ ప్రక్రియ దేశవాళీ జాతి ఎద్దులు, ముర్రా జాతి పశువుల్లో నుంచి వీర్యాన్ని సేకరించి ఇంజక్షన్ల ద్వారా ఎక్కిస్తారు. కృత్రిమ గర్భధారణకు అవసరమైన ఘనీకృత వీరస్, లిక్విడ్ నైట్రోజన్, తదితర సామగ్రిని జిల్లా పశుగణాభివృద్ధి సంఘం(డీఎల్డీఏ) అందజేస్తున్నది. ఎదకు రాని పశువులను గుర్తించిన పశు వైద్యులు పాడి రైతు ఇంటికెళ్లి ఉచితంగా సేవలు అందిస్తారు. ఈ ప్రక్రియలో గోపాలమిత్ర, పశు సంవర్ధకశాఖ సిబ్బంది ప్రధాన భూమిక పోషిస్తారు. పశువులకు కృత్రిమ గర్భధారణ నిర్వహించేందుకు పశుగణాభివృద్ధి సంఘానికి ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నది. కృత్రిమ గర్భధారణ చేసిన పశువులకు విశిష్ట గుర్తింపు సంఖ్యతోపాటు చెవికి ట్యాగ్ వేస్తారు. ఆ పశువు పూర్తి సమాచారాన్ని పశుసంవర్ధక శాఖ వైద్యాధికారులు ఐఎన్ఏపీహెచ్ పోర్టల్లో నమోదు చేస్తారు.
కొనసాగుతున్న నాల్గో విడత
పశువులకు ఉచిత జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా సాగుతున్నది. 2019లో ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటి విడతగా 2019-2020లో 20,625 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న అధికారులు నూరుశాతం పూర్తి చేశారు. 3,047 లేగ దూడలు పు ట్టాయి. రెండో విడత 2020-2021లో 26,432 పశువులకు కృత్రిమ గర్భాధారణ చేయగా 3,775 దూడలు జన్మించాయి. 2021-22 మూడో విడత 21,235 పశువులకు కృత్రిమ గర్భాధారణ చేయాలని లక్ష్యం కాగా.. 19,673 పశువులకే పూర్తి చేశారు. ఇక 2022-2023 నాల్గో విడత కింద 21,235 పశువులకు అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకోగా.. ఇప్పటి వరకు 16,054 పశువులకు పూర్తి చేశారు. ఈ ప్రక్రియ ఈ ఏడాది మార్చి వరకు కొనసాగుతున్నది.
పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలి
మేలు జాతి పశు సంపదను పెంచేందుకు ప్రభుత్వం జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం చేపట్టింది. ఉచితంగానే పాడి రైతుల ఇంటికెళ్లి మరీ సేవలు అందిస్తున్నాం. పాడి రైతును ఆర్థిక బలోపేతం చేసేందుకు పాల ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతున్నది. పుట్టిన దూడలు అధిక నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. నాల్గో విడత కృత్రిమ గర్భధారణ ప్రక్రియ జిల్లాలో కొనసాగుతున్నది. ఇప్పటికే మూడు విడతల్లో జిల్లా వ్యాప్తంగా 68,292 పశువులకు కృత్రిమ గర్భధారణ చేశాం. నాల్గో విడత 21,235 పశువులకు ఇంజక్షన్లు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఇప్పటి 16, 054 పశువులకు పూర్తి అయ్యింది. 6,822 లేగ దూడలు పుట్టాయి. కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని పాడి రైతులు సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
– డా.మన్యం రమేశ్, పశు వైద్యాధికారి, దమ్మపేట