భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల కొద్దిరోజులుగా ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమయ్యారు. భద్రాద్రి జిల్లాకు ఆమె వచ్చి సరిగ్గా నెలరోజులైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రజలకు చేరాలన్నదే తన మార్క్. విద్య, వైద్యం ప్రజలకు సక్రమంగా అందాలని వసతి గృహాలు, ఆసుపత్రులను తనిఖీ చేస్తున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా, ఎవరికీ తెలియకుండా తనిఖీలు ప్రారంభించారు. దీంతో వసతి గృహాల వార్డెన్లు, నైట్ డ్యూటీ చేసేవాళ్లు అప్రమత్తమవుతున్నారు.
వారంరోజుల క్రితం పాల్వంచ మండలంలో జ్యోతిరావుపూలే హాస్టల్ను తనిఖీ చేశారు. సమయానికి అందరూ ఉన్నా.. తినే ఆహారం విషయంలో పరిశుభ్రత లేదని హాస్టల్ నిర్వాహకులకు వార్నింగ్ ఇచ్చేశారు. ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఫస్ట్ వార్నింగ్గా హెచ్చరించారు. ఇదేకాదు మూడురోజుల క్రితం కొత్తగూడెం సింగరేణి ప్రాంతం రామవరంలో ఉన్న మాతా, శిశు కేంద్రాన్ని రాత్రికి రాత్రే తనిఖీ చేసి రిజిస్టర్లను పరిశీలించారు. డ్యూటీ డాక్టర్లు ఉన్నారా.. ఎంతమంది ఉన్నారు.. రోగులకు సరైన సౌకర్యాలు అందుతున్నాయా.. లేదా.. అని రోగులను అడిగి తెలుసుకున్నారు.
ఆవరణమంతా అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్కడా ఫస్ట్ వార్నింగ్ ఇచ్చేశారు. తాజాగా బుధవారం పాల్వంచ మండలంలో ఎస్సీ హాస్టల్ను ఆకస్మిక తనిఖీ చేశారు. వసతి గృహమంతా అపరిశుభ్రంగా, గోడలన్నీ పెచ్చులు లేచిపోయి ఉన్నాయి. కలర్లు కూడా వేయలేదు. వార్డెన్ కూడా సక్రమంగా రారట. రిజిస్టర్లో నమోదైన విద్యార్థులకు ఇక్కడ అంత మంది ఎందుకు లేరని నిర్వాహకులపై ఫైర్ అయ్యారు. సక్రమ పద్ధతిలో పనిచేయకపోతే తప్పుకోండి అని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. స్కూల్ నడుస్తుంటే విద్యార్థి హాస్టల్లో ఉండడాన్ని గమనించారు. కలెక్టర్ తనిఖీలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఉదయం పది గంటలకు ముందే కార్యాలయాలకు చేరుకుంటున్నారు.
విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు. అందుకే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాను. ఎన్నో ఆశలతో పిల్లలను దూరప్రాంతాల నుంచి హాస్టల్స్లో ఉంచి చదివిస్తున్నారు. వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ఆసుపత్రుల్లో ప్రజలకు సరైన వైద్యం అందించాలన్నదే ధ్యేయం.
– ప్రియాంక ఆల, కలెక్టర్