కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 11 : మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం కిందిస్థాయి నాయకులు, దళస సభ్యులను వేధింపులకు గురి చేస్తున్నారని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. జిల్లాలోని చర్ల పోలీసులు, సీఆర్పీఎఫ్ 81 బెటాలియన్, 141 బెటాలియన్ భద్రతా దళాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లో మావోయిస్టు పార్టీ డిప్యూటీ కమాండర్ సహా ఓ దళ సభ్యురాలిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా ఎస్పీ తన కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన ద్వారా వివరాలను వెల్లడించారు. చర్ల మండలం పూసుగుప్ప అటవీ ప్రాంతంలో పోలీసులు, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాల సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు మావోయిస్టులు పట్టుబడ్డారు.
వీరిలో ఒకరు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉసూర్ ఎల్ఓఎస్ దళం డిప్యూటీ కమాండర్ మడివి ఇడుమ కాగా.. మరొకరు అదే దళానికి చెందిన ఎల్ఓఎస్ సభ్యురాలు కుంజా దేవీగా విచారణలో భాగంగా నిర్ధారించారు. మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరు సహకరించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల ప్రయోజనాలను ఇప్పించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు. సమావేశంలో ఓఎస్డీ టి. సాయి మనోహన్, భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్, సీఆర్పీఎఫ్ 81, 141 బెటాలియన్ అధికారులు, చర్ల సీఐ బొడ్డు అశోక్ కుమార్ పాల్గొన్నారు. ్ట