Millets | ఉరుకుల పరుగుల జీవితాలు.. గంటల తరబడి పని గంటలు.. సమయపాలన లేని ఆహార నియమాలు.. మానసిక ఒత్తిళ్లు.. ఫలితంగా చిన్న వయస్సులోనే బీపీలు, మధుమేహాలు.. బాధితుల్లో మార్కెటింగ్, సాఫ్ట్వేర్, వ్యాపార రంగాల్లో పనిచేసే వారే ఎక్కువ.. మనకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి మనం తీసుకునే ఆహారం సరిపోదు.. కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, వరిగలు, జొన్నలు, సజ్జ వంటి చిరుధాన్యాలను నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఉండేట్లు చూసుకుంటే సరిపోతుంది.. తక్కువ ఖర్చుతో సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలపై ఐసీడీఎస్ అధికారులు విస్తృత ప్రచారం చేపడుతున్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు ‘మిల్లెట్స్’ తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు..
ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 27: ‘బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా..’ అంటూ ఈ మధ్య వచ్చిన ఓ పాట ఎలా అయితే ఆదరణ పొందిందో.. ‘మిల్లెట్లు’ కూడా ఇటీవల కాలంలో అంతకంటే ఎక్కువ ఆదరణను పొందుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ పాటకు పేరడీగా ‘మిల్లెట్టు బండెక్కి..’ అన్నా ఆశ్చర్యం లేనంత ప్రాచూర్యాని పొందుతున్నాయి. అనాదిగా వస్తున్న ఆహారంలో చిరుధాన్యాలది ఎంతటి ముఖ్యపాత్రో మనందరికీ తెలిసిన విషయమే. వీటిల్లో రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, సజ్జలు, వరిగలు, ఊదలు, అరికల వంటి చిరుధాన్యాలదే ప్రధాన పాత్ర. అయితే మారుతున్న జీవనశైలిలో భాగంగా కొన్నాళ్లుగా ఇవి నిరాదరణకు గురయ్యాయి. ఒకప్పుడు పేదోళ్ల ఆహారం ఉన్న ఈ చిరుధాన్యాలు ఇప్పుడు పెద్దోళ్ల ఆహారంలో ప్రియమైనవిగా మారా యి. ఎంత ధర అయినా వెచ్చించి సూపర్మార్కెట్లలో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, శిశువులు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యంలో చిరుధాన్యాల పాత్రను ప్రధానంగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటల సాగుకు ప్రాచూర్యాన్ని కల్పిస్తోంది. అధిక విస్తీర్ణంలో సాగు చేపట్టి ఉత్పత్తి పెంచేదిశగా చర్యలు చేపట్టింది. చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలపై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ఈ ఏడాదిని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. అందులో భాగంగానే స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సిబ్బంది గర్భిణులు, బాలింతలతోపాటు ప్రతి ఒక్కరికీ వీటి ప్రాధాన్యాన్ని వివరిస్తున్నారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ఐసీడీఎస్ అధికారులు గడిచిన నెలలో ఊరూరా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
పుష్కల పోషకాల మిల్లెట్లు..
ప్రస్తుతం అధిక శాతం మంది ప్రజలు వరి, గోధుమలను మాత్రమే ఆహార పంటలుగా భావిస్తున్నారు. దీంతో పంటల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ధరతో సంబంధం లేకుండా కొనుగోలు చేసినప్పటికీ కావాల్సినన్ని పోషకాలు శరీరానికి అందడం లేదు. చిరుధాన్యాల్లో మాంస కృత్తులు 10 శాతం ఉంటే.. బియ్యంలో 6.8 శాతమే ఉంటాయి. ఖనిజ లవణాలు కూడా చిరుధాన్యాల్లోనే అధికం. రక్తపుష్టికి ఇనుము ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. రాగులలో ఇనుము, క్యాల్షియం ఎన్నో రెట్లు ఎక్కువ. 100 గ్రాముల చిరుధాన్యాల్లో 344 మి.గ్రా క్యాల్షియం లభిస్తుంది. దంతాలు, ఎముకల పెరుగుదలకు క్యాల్షియం ఎంతగానో దోహదం చేస్తుంది. కొర్రల్లో ఉండే పీచు ఎంతో ఎక్కువ. ఇది ఎక్కువమొత్తంలో శక్తిని విడుదల చేస్తుంది. మధుమేహతో భాదపడేవారికి కొర్రలు ఎంతో మంచి ఆహారం.
సాగు ఖర్చులు తక్కువగానే..
చిరుధాన్యాల్లో పోషకవిలువలు అధికంగా ఉండడమే కాదు.. ధరలు కూడా తక్కువే. మెట్టపంటలకు అనుకూలం అయినందున సాగు ఖర్చులు చాలా స్వల్పం. ఇందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల సాగును ప్రోత్సహిస్తోంది. చిరుధాన్యాలు ఎక్కువగా ప్రకృతి సిద్ధంగానే పండుతాయి. రసాయనాల వినియోగం లేకపోవడంతో ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి.
కొర్రలు..
కొర్రలు చిన్నారులు, గర్భిణులకు బలవర్థకమైన ఆహారం. 60.9 గ్రాముల పిండిపదార్థాలు, 12.3 గ్రాముల మాంసకృత్తులు, 4.3 గ్రాములు కొవ్వు పదార్థాలు, 2.8 మిల్లీగ్రాముల ఇనుము, 0.59 మిల్లీగ్రాముల థయామిన్, 3.2 మిల్లీగ్రాముల నియాసిన్, 31 మిల్లీగ్రాముల కాల్షియం, 473 కేలరీల శక్తి వీటిల్లో ఉంటాయి.
జొన్నలు..
గుండె జబ్బులను అడ్డుకునే శక్తి జొన్నలకు మాత్రమే ఉంటుందని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి. వీటిలో క్యాల్షియం, ప్రోటీన్లు, పీచు పదార్థాల వంటి పోషకాలు ఉంటాయి. 349 కేలరీల శక్తి 10.4 గ్రాముల మంసంకృత్తులు, 1.6 గ్రాముల పీచు పదార్థం, 0.37 మిల్లీ గ్రాముల రైబోప్లెవిన్, 3.1 మిల్లీగ్రాముల నియాసిన్, 25 మిల్లీగ్రాముల కాల్షియం, 4.1 గ్రాముల ఐరన్, 1.6 గ్రాముల జింక్ ఉంటాయి.
సామలు..
సామల్లో 7,7 గ్రాముల ప్రొటీన్లు, 5.2 గ్రాముల కొవ్వు పదార్థాలు, 7.6 గ్రాముల ఫైబర్, 1.5 గ్రాముల మినరల్స్, 9.3 మిల్లీగ్రాముల ఇనుము, 17 మిల్లీగ్రాముల కాల్షియం, 207 కేలరీల శక్తి ఉంటాయి.
సబ్జా..
సబ్జా నీరు తాగితే శరీరానికి ఎంతో ఉపశమనం. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. దాహం తీర్చడంతోపాటు ఎండలో శరీరం డీహైడ్రేషన్కు గురి కాకుండా చూస్తుంది. 67.5 గ్రాముల పిండిపదార్థాలు, 11.6 గ్రాముల మాంసం కృత్తులు, 5 గ్రాముల కొవ్వు పదార్థాలు, 8 మిల్లీ గ్రాముల ఇనుము, 42 మిల్లీగ్రాముల కాల్షియం, 296 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 0.25 గ్రాముల రైబోప్లేవీస్ వంటివి వీటిల్లో ఉంటాయి.
రాగులు..
చిరుధాన్యాల రారాజు రాగులు. వీటిని తైదలు అని కూడా అంటారు. చిన్నారులకు రాగులతో కూడిన ఆహారాన్ని అందిస్తే వారిలో పెరుగుదల అధికంగా ఉంటుందం టున్నారు వైద్యులు. బియ్యం, గోధుమల కంటే రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. రాగుల్లో పోషకాలు 72 గ్రాములు పిండి పదార్థాలు, 7.3 గ్రాముల మాంసకృత్తులు, 3.9 గ్రాముల ఇనుము, 344 మిల్లీగ్రాముల కాల్షియం, 283 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 0.42 మిల్లీగ్రాముల థయామిన్, 0.19 మిల్లీగ్రాముల నియాసిన్, మెగ్నీషియం, పోటాషియం ఉంటాయి.