భద్రాచలం, నవంబర్ 24: దళిత బంధు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిని వదిలేది లేదని, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితులందరికీ దళిత బంధు అందుతుందని చెప్పారు.
ఇందుకోసం ఏ ఒక్కరు కూడా కనీసం ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. భద్రాచలం డివిజన్లో మొదటి దఫా 100 మందికి దళిత బంధు అందిందని, మరో 500 మందికి అందుతున్నదని చెప్పారు. ఈ సారి 2000 మంది దళిత బంధు అందుకుంటారని అన్నారు. దళిత బంధు పథకానికి దళితులంతా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దళిత బంధు పథకం పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే పార్టీ నాయకులు, అధికారుల దృష్టికి తేవాలని కోరారు.
ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరి చొప్పున బీఆర్ఎస్ వార్డు ఇన్చార్జ్లను నియమించినట్లు డాక్టర్ తెల్లం వెంకట్రావ్ తెలిపారు. ఇప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు అయ్యేంత వరకు ఈ ఇన్చార్జ్లు తమ ఓటర్లతో నిరంతరం అంటిపెట్టుకుని ఉంటారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తారని, బీఆర్ఎస్కు ఎందుకు ఓటు వెయ్యాలో చెబుతారని అన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి నాయకులు నర్రా రాము, బొంబోతుల రాజీవ్, గంగా భారతి, మదారి మామిడి పుల్లారావు, ఎండీ బషీర్, లకావత్ వెంకటేశ్వర్లు , చుక్కా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.