ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తూ, దేశానికి వెలుగులందిస్తున్న నల్ల సూర్యులకు సింగరేణి యాజమాన్యం అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉత్పత్తి, ఉత్పాకతలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వారి సంక్షేమానికి కృషిచేస్తున్నది. కార్మికులను భూగర్భ గనిలోకి తీసుకెళ్లి, తీసుకువచ్చే సమయంలో కేజీకి విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్య పరిష్కారానికి కొత్తగూడెం ఏరియా పీవీకే-5 ఇైంక్లెన్ గనిలో రూ.కోటితో జనరేటర్ సదుపాయం కల్పించింది. ఇక నుంచి కరెంట్ పోయినప్పుడల్లా నాలుగు కిలోమీటర్లు నడిచివెళ్లే సమస్యకు చెల్లుచీటీ పడగా, కార్మికుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
– రామవరం, జూలై 23
భూగర్భ గనిలో విధులు నిర్వర్తించే కార్మికులు నిత్యం కేజీల్లో వస్తూ పోతూ ఉంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇైంక్లెన్ గనిలో 282 మీటర్ల లోపల కార్మికుల రాకపోకలకు దీనిని వాడుతున్నారు. గతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సుమారు నాలుగు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి ఉండేది. అప్పటికే విధులు నిర్వర్తించి అలసి పోయిన కార్మికులు చాలా ఇబ్బందులుపడేవారు. కార్మికుల సమస్యను గుర్తించిన టీబీజీకేఎస్ సింగరేణి యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లింది. అందుకు వెంటనే స్పందించిన యాజమాన్యం.. ఇకపై విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా కేజీని నిరంతరాయంగా నడిపేందుకు జనరేటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ.కోటితో బాహుబలి జనరేటర్ (750 కేవీ) ఏర్పాటు చేసింది. దీంతో కార్మికుల కేజీ కష్టాలు దూరమయ్యాయి. దీంతో కార్మికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సింగరేణి వ్యాప్తంగా మూడు షాప్టుమైన్లు వైడింగ్ ఇంజిన్తో నడుస్తున్నాయి. ఇందులో మందమర్రి ఏరియా పరిధిలోని శాంతిఖని, కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5 ఇైంక్లెన్, వెంకటేశ్ఖని ఉంన్నాయి. మొట్టమొదటి సారిగా సింగరేణి డైరెక్టర్ (పీఅండ్పీ) జీ వెంకటేశ్వర్రెడ్డి 2023, ఏప్రిల్ 12న జనరేటర్తో నడిచే కేజీని ప్రారంభించారు. ఈ కేజీలో అప్పుడప్పడు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం వల్ల అప్పటికే అలసిపోయిన కార్మికులు కేజీ నడవక అనేక అవస్థలు పడేవారు. ఇప్పడు ఆ పరిస్థితి లేకుండా పోయింది.
జనరేటర్పనితీరు..
రూ.కోటితో ఏర్పాటు చేసిన 750 కేవీ జనరేటర్ డీజిల్తో నడుస్తుంది. నిర్విరామయంగా 16 గంటలు పనిచేస్తుంది. గంటకు 50 లీటర్లు వినియోగించుకుంటుంది. వెయ్యి లీటర్ల సామార్థ్యం కలిగి ఉంటుంది. ఈ జనరేటర్ సాయంతో ఫ్యాను (గని లోపలనుంచి గాలిని బయటికి పంపే 300 హెచ్పీ ఎగ్జాస్ట్) పంపులు, కేజీ నడిపించుకునే అవకాశం ఉంది.
రూ.కోటి య్ంరత్రం నీళ్లపాలవకుండా..
గత నెల జూన్ 17న విద్యుత్ సరఫరాలో సుమారు 6 గంటల పాటు అంతరాయం ఏర్పడింది. గనిలో గేయిన్వెల్ కంపెనీకి చెందిన ట్విన్ బోల్టర్ ఫేస్లో పడిపోవడంతో దానికి జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరాచేసి, వెనుకకు తీసుకురాగలిగారు. లేదంటే కోటి రూపాయల యంత్రం నీటిలో మునిగిపోయే పరిస్థితి ఏర్ప డేది. అలాగే జనరేటర్ సాయంతో పంపుమో టర్లను నడిపి గనిలో ఏర్పడ్డ నీటిని తోడేశారు.
ఇబ్బందులు తొలిగినయ్..
గతంలో కరెంట్ పోతే కేజీ పనిచేసేది కాదు. దీంతో గనిలోపలికి పోవాలన్నా, పనిచేసుకొని రావాలన్నా అనేక అవస్థలు పడ్డాం. అలసిసొలసిన మాకు కేజీ బంద్ ఉందని తెలిస్తే ఇంకా నెరివడేటోళ్లం. కానీ, ఇక ఆ సమస్య లేదు. జనరేటర్ ఏర్పాటు వల్ల కరెంటు వచ్చేదాకా వేచి ఉండేది లేదు. అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డా భయపడే అవసరం లేదు. జనరేటర్ ఏర్పాటుచేసిన అధికారులకు ధన్యవాదాలు.
– మేదరి నరేశ్, జనరల్ మజ్దూర్, పీవీకే-5 ఇైంక్లెన్, కొత్తగూడెం ఏరియా
కార్మికుల సంక్షేమానికే ప్రాధాన్యం..
కార్మికుల చిరకాల వాంఛను యాజమాన్యం నెరవేర్చింది. సుమారు 7 ఏండ్లుగా జనరేటర్ కోసం ప్రయత్నాలు జరిగాయి. యాజమాన్యం కార్మికుల అవస్థలు అర్థం చేసుకోవడంతో ఏర్పాటుచేశారు. కరెంట్ లేకపోతే సుమారు నాలుగు కిలోమీటర్లు కార్మికులు నడుచుకుంటూ వచ్చిపోయేవాళ్లు. ఇప్పుడు అలాంటి కష్టాల్లేవు. జనరేటర్ సాయంతో కేజీ, ఫ్యాను, పంపులను అత్యవసరం అనుకున్నప్పుడు వాడుకోవచ్చు.
– పాలడుగు శ్రీనివాస్, గని మేనేజర్ పీవీకే-5 ఇైంక్లెన్